వావ్.. మీ సంకల్పం
అద్దకాన్ని చూసి మురిసిన మహిళలు
పెందుర్తి: తలపై బిందె పెట్టుకుని నడిచారు.. తమకు పరిచయం లేని కోలాటంతో సందడి చేశారు.. సహజ సిద్ధమైన రంగుల అద్దకంతో తయారు చేస్తున్న వస్త్రాలను చూసి అబ్బురపోయారు. ఎద్దు గానుగ ఆడుతుంటే ఆసక్తిగా గమనించారు.. లక్క బొమ్మలను చూసి మురిసిపోయారు.. ప్రకృతి సిద్ధంగా పండిన దినుసులతో తయారు చేసిన పిండి వంటలను రుచి చూసి ‘వావ్’అన్నారు. పెందుర్తి మండలం పినగాడి సమీపంలోని సంకల్ప కళాగ్రామాన్ని ఐఎఫ్ఆర్ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ఈస్ట్రన్ రీజియన్ ఆధ్వర్యంలో మొత్తం 50 దేశాలకు చెందిన 60 మంది ప్రతినిధులు ఇక్కడ సందడి చేశారు. సహజ సిద్ధమైన రంగులతో వస్త్రాలు తయారు చేసే టై అండ్ డై వర్క్షాప్లో వారు పాల్గొని, వివిధ ఆకృతుల్లో ఉన్న దుస్తులకు రంగులు అద్దారు. అనంతరం ఎద్దు గానుగ ఆడే ప్రక్రియను తిలకించారు. సంప్రదాయ పద్ధతిలో విత్తనాలు చల్లడం, పప్పు ధాన్యాలను దంచడం వంటివి స్వయంగా చేసి ముచ్చటపడ్డారు. లక్క బొమ్మల తయారీ ప్రక్రియను ఆసక్తిగా తిలకించారు. ముందుగా సంకల్ప కళాగ్రామం ఆవరణలో కోలాటం ఆడి మురిసిపోయారు. భారత నావికాదళ అధిపతి సతీమణి త్రిపాఠి, తూర్పు నావికాదళ ప్రధాన అధికారి సతీమణి భల్లా తదితర ఉన్నతాధికారుల సతీమణులు విదేశీ బృందానికి నేతృత్వం వహించారు. సంకల్ప గ్రామం వ్యవస్థాపకుడు ఆకుల చలపతిరావు, పార్వతి, ఆకుల జమిల్యా తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
వావ్.. మీ సంకల్పం
వావ్.. మీ సంకల్పం
వావ్.. మీ సంకల్పం
వావ్.. మీ సంకల్పం


