వలయం
ఏయూ చుట్టూ
వివాదాల
ప్రధాన ఇన్గేట్లకు తాళాలు.. అవుట్గేట్ ద్వారానే రాకపోకలు శతాబ్ది వేళ పోలీసుల మోహరింపు.. క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం ఐడీ కార్డు తప్పనిసరితో విద్యార్థుల్లో ఆందోళన గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యమ హెచ్చరికలతో పరిస్థితి మరింత సంక్లిష్టం
ఏయూలో మోహరించిన పోలీసులు
వరుస ఘటనలతో అష్టదిగ్బంధనంలో యూనివర్సిటీ
పోలీసు వలయంలో క్యాంపస్
వర్సిటీ ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు. నిత్యం తనిఖీలు, గస్తీ, ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. శతాబ్ది ఉత్సవాల వేళ ఖాకీల బూట్ల చప్పుళ్లు వినిపించడం పట్ల అధ్యాపకులు, మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ సిటీ: ఒకప్పుడు నోబెల్ బహుమతి గ్రహీతలు, మేధావులను తీర్చిదిద్దిన ప్రాంగణం.. ఇప్పుడు వివాదాలు, ఉద్రిక్తతలకు నిలయంగా మారుతోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం.. ఖాకీల బూట్ల చప్పుళ్లతో మార్మోగుతోంది. శతాబ్ది ఉత్సవాల వేళ ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీ పోలీసులు అష్టదిగ్బంధనంలోకి వెళ్లిపోయింది. ఏటా వేలాది మందిని విద్యావంతులుగా, సమాజానికి దిక్సూచీలుగా తీర్చిదిద్దే ఏయూ ప్రాంగణం.. నేడు ఆంక్షల వలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఏయూ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఇన్గేట్కు తాళాలు వేయడం ఇప్పుడు క్యాంపస్లో చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఏయూలో జరుగుతున్న పరిణామాలకు కారణమేంటి? ఉద్రిక్త పరిస్థితుల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయా? ఆంక్షలు పెట్టాల్సిన పరిస్థితులను ఎవరు కల్పించారు? ఇలా అనేక ప్రశ్నలు విద్యార్థి లోకంలో ఉత్పన్నమవుతున్నాయి.
భద్రతా వలయం తొలగింపుతో
ఇబ్బందులు
గత ప్రభుత్వ హయాంలో పరిపాలనా భవనం (సీఏఓ) చుట్టూ ఏర్పాటు చేసిన భద్రతా కంచెను ఇటీవల తొలగించడం కూడా వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంతో ఆందోళనకారులు నేరుగా పరిపాలనా విభాగాల వరకు చేరే పరిస్థితి ఏర్పడిందని కొందరు ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. ఏయూలో జరుగుతున్న ప్రతి ఆందోళన వెనుక కొందరు వర్సిటీకి చెందిన పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యార్థులు క్లాసులకు వెళ్లి పరిశోధనలు చేయకుండా, ప్లకార్డులు పట్టుకుని గేట్ల వద్ద బైఠాయించడం వెనుక ఉన్న రాజకీయ శక్తులెవరో విచారణ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యమ బాటలో గెస్ట్ ఫ్యాకల్టీ
కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీలు (అతిథి అధ్యాపకులు) తమ సర్వీస్ క్రమబద్ధీకరణ, పెండింగ్ వేతనాల అంశాలపై మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో, ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది మరింత ఉద్రిక్తతకు దారితీయవచ్చని భావిస్తున్నారు.
ఏయూలో ఇతరులకు ప్రవేశంలేదంటూ ప్రకటన
ఐడీ కార్డు ఉంటేనే ప్రవేశం
విద్యార్థి సంఘాల పోటాపోటీ నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ పరిపాలన కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన గేట్లను మూసివేసి, రిజిస్ట్రార్ కార్యాలయం వైపు ఉన్న అవుట్గేట్ ద్వారానే రాకపోకలను అనుమతిస్తున్నారు. లోపలికి ప్రవేశించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. దీంతో సాధారణ విద్యార్థులు, ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ వాకింగ్కు వచ్చే ప్రజలకు కూడా ప్రవేశం నిలిపివేయడంతో క్యాంపస్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
శతాబ్ది వేళ ప్రశాంతత ఎక్కడ?
ప్రశాంతమైన విద్యా వాతావరణంలో బోధన, పరిశోధనలు సాగాల్సిన చోట నిత్యం ఆందోళనలు, ఆంక్షలు నెలకొనడం బాధాకరమని విద్యావేత్తలు అంటున్నారు. గేట్లకు తాళాలు వేయడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని, సమస్యల మూలాలను గుర్తించి చర్చల ద్వారా పరిష్కరించాలని సూచిస్తున్నారు. విద్యార్థులను తరగతుల వైపు మళ్లించడంతో పాటు, గెస్ట్ ఫ్యాకల్టీ, ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. శతాబ్ది వేడుకల సందర్భంగా వైభవాన్ని చాటాల్సిన ఏయూం ప్రస్తుతం అనిశ్చితి ముసురులో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ తనిఖీలు, పరిమితుల మధ్య పనిచేయడం మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని నాన్–టీచింగ్ స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి, యూనివర్సిటీ అభివృద్ధి, ప్రశాంతతపై పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు కోరుతున్నారు.
వలయం
వలయం


