
యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం
మహారాణిపేట/ఏయూక్యాంపస్: విశాఖలో ఈనెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సోమవారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సమీపంలోని గీతం యూనివర్సిటీ వరకూ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. యోగా డేలో పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలని సూచించారు. యోగా డే ఏర్పాట్లను యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి కృష్ణబాబు వివరించారు. ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఏయూ మైదానంలో జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. ఏయూ మైదానంలో విద్యార్థులతో యోగా చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖలో చారిత్రక వేడుకకు నాంది పలుకుతున్నామన్నారు. యోగా డేలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నాచారు. యోగా డే నిర్వహణకు సంబంధించి భారతీయ నౌకాదళం కూడా 11 నౌకల్ని ఆర్కే బీచ్ సమీపంలో ప్రదర్శించనుందని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ ఎం.శ్రీభరత్, సిఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర అధికారులు పాల్గొన్నారు.
విశాఖలో ఏర్పాట్లనుపరిశీలించిన సీఎం చంద్రబాబు