
మేయర్ను పట్టించుకోని ఎమ్మెల్యే
● వంశీకృష్ణ ఏకపక్ష వైఖరి ● మేయర్, స్థానిక కార్పొరేటర్కు తెలియకుండానే భూమిపూజ
డాబాగార్డెన్స్: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏకపక్ష నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. నగర ప్రథమ పౌరుడైన మేయర్ పీలా శ్రీనివాసరావు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, స్థానిక కార్పొరేటర్కు సమాచారం ఇవ్వకుండానే వార్డు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన మూడు రోజుల ముందుగానే ఖరారైనప్పటికీ, ఎమ్మెల్యే హడావుడిగా భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా విశాఖ వస్తున్న తరుణంలో భూమిపూజ కార్యక్రమాన్ని వేరొక రోజుకు మార్చుకుందామని మేయర్ పీలా శ్రీనివాసరావు సూచించారు. అయితే ఎమ్మెల్యే వంశీకృష్ణ మాత్రం మేయర్ సూచనలను బేఖాతర్ చేయడంపై ‘నగర ప్రథమ పౌరుడికిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ కూటమి నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కార్పొరేటర్కు సమాచారం లేదు
వార్డు అభివృద్ధి పనులకు సంబంధించి సోమవారం జరిగిన భూమిపూజ సందర్భంగా కనీసం స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్కు కూడా సమాచారం ఇవ్వకుండా, తన పార్టీకి చెందిన కొందరు చోటా నాయకులతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన భూమిపూజ విషయంలో తనకెందుకు సమాచారం ఇవ్వలేదో చెప్పాలని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ సదరు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
కౌన్సిల్లో పోరాడి నిధులు సాధించిన కార్పొరేటర్
జీవీఎంసీ 41వ వార్డు అభివృద్ధి పనులకు సంబంధించి స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ కౌన్సిల్లో పోరాడారు. సుమారు రూ.10 కోట్లకు పైగా నిధులు సాధించి, వార్డు సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా సొంత నిధులతో వార్డుకు సేవలందిస్తున్న కార్పొరేటర్ లేకుండా, హోల్సేల్ మార్కెట్, క్రిస్టియన్ శ్మశాన వాటిక మౌలిక వసతులకు కనీసం ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా భూమిపూజ చేయడపై స్థానికులు విస్మయం వ్యక్తం చెందారు.