సర్వం సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సన్నద్ధం

Jun 17 2025 4:49 AM | Updated on Jun 17 2025 4:49 AM

సర్వం

సర్వం సన్నద్ధం

21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
● పాల్గొననున్న ప్రధాని మోదీ ● నగరంలో 5 లక్షల మందితో యోగాసనాలు ● ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు 326 కంపార్ట్‌మెంట్ల ఏర్పాటు ● 3.5 లక్షల యోగా మ్యాట్లు సిద్ధం ● గిన్నిస్‌ రికార్డు కోసం ప్రణాళికలు ● 21న విద్యా సంస్థలకు సెలవు

విశాఖ సిటీ: యోగాంధ్రకు నగరం ముస్తాబవుతోంది. ఐదు లక్షల మంది యోగాసనాలకు విశాఖ వేదిక అవుతోంది. గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కేందుకు సమాయత్తమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఈ నెల 21వ తేదీన విశాఖ అతిథ్యమిస్తోంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు తరలిరానున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలను సైతం పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమం దృష్ట్యా విద్యా సంస్థలకు 21 తేదీన సెలవుగా ప్రకటించారు.

2 కి.మీ మేర ప్రధాన వేదిక

ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు కాళీమాత ఆలయం నుంచి పార్కు హోటల్‌ వరకు ప్రధాన వేదిక కానుంది. ఇక్కడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, నేవీ అధికారులు, అధికారులు యోగాసనాలు చేయనున్నారు. ఈ రెండు కిలోమీటర్లు మేర ప్రధాన వేదికలో 12 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో వెయ్యి మంది ఉంటారు. ప్రధాన వేదిక తర్వాత సీ1 కంపార్ట్‌మెంట్‌ ఉంటుంది. పార్కు హోటల్‌ వరకు మొత్తం 12 కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. సీ6 వరకు 9 వేల మంది ఇండియన్‌ నేవీ, కోస్ట్‌ గార్డు సిబ్బందితో పాటు, ఇంటర్నేషనల్‌ యోగా స్టూడెంట్స్‌, యోగా అసోసియేషన్‌ సభ్యులు, వివిధ స్థాయిల్లో యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు పాల్గొంటారు. అలాగే సీ7 నుంచి సీ12 వరకు గల కంపార్ట్‌మెంట్లలో సమీపంలోని నివాసితులు భాగస్వామ్యమవుతారు. ఈ ప్రధాన వేదిక వద్ద పాల్గొనే వారి అవసరాలకు అనుగుణంగా 1400 టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రధాన వేదిక ప్రాంతంలో అదనపు కంపార్ట్‌మెంట్లతో కలిపి మొత్తం 15 వేల మంది పాల్గొననున్నారు. ఒక వేళ వర్షం పడితే ఈ ప్రధాన వేదికను ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలోకి మార్చనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

విదేశీ విద్యార్థుల రాక

ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశీ విద్యార్థులు రానున్నారు. 13 దేశాలకు చెందిన 76 మంది విద్యార్థులు ఈ నెల 20న విశాఖకు చేరుకోనున్నారు. ముందు వీరికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మూడు ప్రత్యేక బస్సుల్లో కంపార్ట్‌మెంట్లకు తీసుకురానున్నారు.

భారీ భద్రతా ఏర్పాట్లు

భారీ స్థాయిలో చేపడుతున్న యోగాంధ్ర వేడుకలకు పోలీసులు కూడా భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రధాన వేదిక వద్దే కాకుండా ప్రతి కంపార్ట్‌మెంట్‌ వద్ద పోలీసు బందోబస్తు కల్పిస్తున్నారు. ఇప్పటికే నగరంలో బాంబ్‌ తనిఖీ బృందాలతో నిశితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించారు. యోగాంధ్రకు వచ్చే వాహనాలతో జాతీయ రహదారిలో ట్రాఫిక్‌ పెరిగే అవకాశముంది. దీంతో ఆ రోజున కొన్ని గంటల పాటు సాధారణ వాహనాల మళ్లింపుపై దృష్టి పెట్టారు. ఆ రోజు పోర్టు నుంచి లారీ రాకపోకలు నియంత్రించనున్నారు.

326 కంపార్ట్‌మెంట్లు

ఆర్కే బీచ్‌ రోడ్‌లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు ఏకకాలంలో 5 లక్షల మంది యోగాసనాలు చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మొత్తంగా 326 కంపార్టుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక మినహా మిగిలిన కాంపార్ట్‌మెంట్లలో 3.5 లక్షల మందికి చోటు కల్పిస్తున్నారు.

ప్రజలు కంపార్ట్‌మెంట్లలోకి చేరుకున్న తర్వాత టీషర్టు, క్యూఆర్‌ కోడ్‌ అందజేస్తారు.

ప్రతి దాంట్లో గెజిటెడ్‌ ర్యాంకు అధికారి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు.

తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, వైద్య సిబ్బందితో పాటు పోలీసులతో పాటు 10 మంది వలంటీర్లు ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో అందుబాటులో ఉంటారు.

ప్రతి రెండు లేదా మూడు కంపార్ట్‌మెంట్లకు అనుబంధంగా 20 బెడ్లతో కూడిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రజలను తరలించేందుకు మొత్తంగా 10,235 ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను వినియోగించనున్నారు.

ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను కంపార్ట్‌మెంట్లకు తరలించేందుకు వీలుగా ముందుగా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు.

దాని ప్రకారం ఎవరు ఏ కంపార్టమెంట్‌లోకి వెళ్లాలన్న విషయాన్ని మ్యాపింగ్‌ చేస్తున్నారు.

దానికి అనుగుణంగానే ప్రజలు వారికి కేటాయించిన కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి నెంబర్‌ ప్రకారం స్థానంలో కూర్చోవాల్సి ఉంటుంది.

22 రికార్డులు దక్కేలా..

అంతర్జాతీయ యోగా డే వేడుకల ద్వారా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కేందుకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏకంగా 12 రికార్డులు దక్కించుకునేందుకు కసరత్తు చేస్తోంది. విశాఖ సముద్ర తీరంలో 11 నావికాదళ నౌకలపై నేవీ అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. ఇది కూడా రికార్డు క్రియేట్‌ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అల్లూరి జిల్లాకు చెందిన 25 వేల మంది గిరిజన విద్యార్థులు ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో యోగా చేయనున్నారు. ఇది కూడా రికార్డు నెలకొల్పే అవకాశముంది. ఇలా మొత్తంగా 22 రికార్డులు సొంతం చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఇప్పటికే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధులకు సమాచారం అందించారు. సాంకేతిక సాయంతో గిన్నిస్‌ బుక్‌ వాళ్లు లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.

సర్వం సన్నద్ధం1
1/1

సర్వం సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement