
ఏ తల్లి కన్నబిడ్డో..!
తగరపువలస: సింహాచలం–విజయనగరం రోడ్డులోని అనంతవరం కూడలి బస్టాప్లో ఓ గుర్తు తెలియని మహిళ అప్పుడే పుట్టిన మగబిడ్డను వదిలేసి వెళ్లిపోయింది. ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామ పంచాయతీకి చెందిన బెవర సత్యవమ్మ ఈ బిడ్డను గ్రామంలోకి తీసుకువెళ్లి కోరాడ వరలక్ష్మి అనే మహిళకు ఇచ్చింది. దీంతో పంచాయతీలో కలకలం మొదలైంది. బిడ్డను పెంచుకోవడానికి పలువురు పోటీపడటంతో స్థానికులు ఆనందపురం పోలీసులకు, పద్మనాభం 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఎం.తిరుపతి, ఎస్.బంగార్రాజు శిశువుకు అత్యవసర చికిత్స అందించి, హుటాహుటిన కేజీహెచ్కి తరలించారు. ఆనందపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.