తల్లిదండ్రుల ఆందోళన
50 ఏళ్ల చరిత్ర గల పాఠశాల మూసివేతకు యత్నం
● ఉపాధ్యాయులు లేరని గేటుకు తాళం ● విద్యాశాఖ అధికారులతో చర్చలు ● సమస్య పరిష్కారం కాకుండానే వెనుదిరిగిన అధికారులు
అధికారుల నిర్లక్ష్యం
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాలను మూసివేయడం తగదు. పాలకులు, విద్యాశాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కూట మి ప్రభుత్వం తీరు ఏమాత్రం బాగోలేదు.
–అప్పలరాజు, పేరెంటు, గొల్లకంచరపాలెం.
పాఠశాలనుకొనసాగించాలి
జీవనోపాధికోసం పల్లె నుంచి పట్టణానికి వచ్చాం. కంచరపాలెం పరిధి పరిసర ప్రాంతాల్లో ఏళ్ల చరిత్ర కల్గిన పాఠశాల అని విని మా పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించాం. ఇప్పుడు మూసివేస్తామని చెప్పడం దారుణం. పాఠశాల మూసివేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
–టి.సావిత్రి దుర్గానగర్, కంచరపాలెం
కంచరపాలెం: జీవీఎంసీ పరిధిలోని కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేట ఉన్నత పాఠశాల క్యాంపస్లో ఉన్న జీవీఎంసీ కంచరపాలెం ప్రాథమిక పాఠశాలను టీచర్లు లేరనే సాకుతో మూసివేయడానికి ప్రయత్నించారు. దీంతో సోమవారం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలను మూసివేయడాన్ని నిరసిస్తూ, తల్లిదండ్రులు కంచరపాలెం నేతాజీ కూడలి ఫ్లైఓవర్ వంతెన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గతంలో కంచరపాలెం పరిధిలో ఆర్పీపేట ప్రాథమిక, కంచరపాలెం ప్రాథమిక, రామ్మూర్తిపంతులుపేట, కే.కాలనీ ఉన్నత పాఠశాలలు ఉండేవి. పదేళ్ల క్రితం కే.కాలనీ ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయుల లబ్ధి కోసం బర్మాక్యాంప్ కొండవాలు ప్రాంతానికి తరలించారు. అప్పటి నుంచి కే.కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రామ్మూర్తిపంతులుపేట ఉన్నత పాఠశాలలోనే చేరుతున్నారు.
ఉపాధ్యాయుల కొరతపై ఆందోళన
కంచరపాలెం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది వరకు 11 మంది ఉపాధ్యాయులు ఉండగా, ప్రస్తుతం కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగిలిన 9 మంది ఉపాధ్యాయులు కౌన్సెలింగ్లో బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 3, 4, 5 తరగతులకు చెందిన 225 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం ఉదయం పాఠశాలను తెరవకుండా తాళాలు వేశారు. తమ పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చిన తల్లిదండ్రులు తాళాలు వేసి ఉండటంతో ఆందోళన చెందారు.
పోలీసుల జోక్యం
పాఠశాల ఆవరణలో రికార్డు షీట్లు తీసుకుని సమీప పాఠశాలల్లో చేరాలంటూ ఏర్పాటు చేసిన బోర్డును చూసిన తల్లిదండ్రులు స్థానిక కార్పొరేటర్ రాజశేఖర్కు, విద్యాశాఖాధికారులకు ఫోన్లు చేశారు. వార్డు మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మకు, ఎస్ఎఫ్ఎస్ నాయకులకు సమాచారం అందించడంతో, ఈశ్వరమ్మ విద్యాశాఖాధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి విద్యాశాఖాధికారులు రావాలంటూ నినాదాలు చేశారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో కంచరపాలెం నేతాజీ ఫ్లైఓవర్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో సీఐ చంద్రశేఖర్ జోక్యం చేసుకుని, తల్లిదండ్రులకు నచ్చచెప్పి, విద్యాశాఖాధికారులతో మాట్లాడి పాఠశాల తెరిచేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
మొక్కుబడిగా సమావేశం
పాఠశాల మూసివేతపై ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సోమవారం సాయంత్రం ఎంఈవో–2 దివాకర్, సీఐచంద్రశేఖర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ప్రేమ్కుమార్ , డిప్యూటీ డీఈవో సోమశేఖర్ కూడా పాల్గొన్నారు. సమస్య పరిష్కారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.
విద్యార్థుల జీవితాలతో ఆటలు
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యకు, పాఠశాలలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నేడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలను మూసివేయకుండా చర్యలు తీసుకోవాలి –ఎస్.పుష్పలత, తోటవీధి, కంచరపాలెం.
తల్లిదండ్రుల ఆందోళన
తల్లిదండ్రుల ఆందోళన
తల్లిదండ్రుల ఆందోళన


