
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలుచేయాలి
బీచ్రోడ్డు: అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సాధికార సర్వేలో ‘ప్రభుత్వ ఉద్యోగి’ అనే పదాన్ని తొలగించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు సోమవారం జీవీఎంసీ వద్ద గల గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకురాలు కె.వెంకటలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారికి ఇస్తున్నది కేవలం గౌరవ వేతనం మాత్రమేనని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఆరేళ్లుగా వేతనాలు పెంచలేదని, ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తల్లికి వందనం’, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇంటి స్థలాలు వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి అంగన్వాడీ వర్కర్కు, హెల్పర్కు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు మణి, గౌరవ సలహాదారు బృందావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవి, కోశాధికారి కె. పద్మావతి, జిల్లా నాయకులు శ్రీదేవి, సత్యవతి, బేగం, శివలక్ష్మి, వెంకటలక్ష్మి, దుర్గ, మాధురి, సుగుణ, సులోచన తదితరులు పాల్గొన్నారు.