
యోగాంధ్రకు నిధుల కటకట
● గంటల వ్యవధిలోనే ఆవిరైన రూ.20 కోట్లు ● నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు అవసరం ● ఇప్పటికి వరకు సగం కూడా విడుదల చేయని కూటమి ప్రభుత్వం ● మూడు రోజుల ముందు నిధుల కోసం అగచాట్లు ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం మూడు రోజులే మిగిలి ఉన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర–2025’ కార్యక్రమానికి నిధుల లేమి వెంటాడుతోంది. కార్యక్రమ నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు అవసరమని జిల్లా యంత్రాంగం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపగా.. ఇప్పటివరకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అదీ మంగళవారం విడుదలైన ఈ అరకొర నిధులు.. గంటల వ్యవధిలోనే బిల్లుల చెల్లింపులకు ఆవిరైపోవడంతో ఖజానా మళ్లీ ఖాళీ అయింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
వచ్చీ రాగానే ఖర్చు
విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం మొదలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకు గత నెల రోజులుగా సమీక్షలు చేస్తూ.. ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఈ కార్యక్రమ నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే మంగళవారం కేవలం రూ.20 కోట్లు మాత్రమే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రూ.20 కోట్లు జిల్లా యంత్రాంగం ఖాతాలో పడిన నాలుగు గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. అయితే, పేరుకుపోయిన బిల్లులతో పోలిస్తే ఇది నామమాత్రమే. చెల్లించాల్సిన ప్రతీ వంద రూపాయలకు కేవలం పది రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి చేతులు దులుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. స్టేజీల నిర్మాణం, బారికేడ్లు, స్నాక్స్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు వంటి అత్యవసర పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఈ పాక్షిక చెల్లింపులు జరిపారు. మిగిలిన మొత్తం కోసం వారి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో, తక్షణమే మిగతా నిధులు విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసింది.
భారీ ఏర్పాట్లు.. అరకొర నిధులు
ఒకవైపు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నా, మరోవైపు కార్యక్రమ ఏర్పాట్లు మాత్రం సాగుతున్నాయి. సుమారు 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేసి, బీచ్ రోడ్డులో తొక్కిసలాట జరగకుండా 326 ప్రత్యేక కంపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి ప్రసంగించేందుకు ప్రత్యేక వేదికలు సిద్ధమవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం 2 లక్షల మ్యాట్లు, టీ–షర్టులు అందించగా, మరో 3 లక్షల మందికి అవసరమైన వాటిని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంది. దీనికి తోడు పాల్గొనే 5 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.100 విలువైన స్నాక్స్ ప్యాకెట్ అందించాలన్నా రూ.5 కోట్ల ఖర్చు తప్పదు. ఈ ఖర్చులన్నీ కాకుండా వీఐపీ, వీవీఐపీల బస, రవాణా వంటి అదనపు వ్యయాలు ఉన్నాయి. ఇప్పటికే జీవీఎంసీ, వీఎంఆర్డీఏ వంటి సంస్థలు తమ నిధులతో సుందరీకరణ, నిర్మాణ పనులు చేపడుతూ అదనపు భారం మోస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అంచనా వ్యయంలో కనీసం సగం కూడా విడుదల చేయకపోవడంతో, ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలో తెలియక అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.