
22 వేల మందితో బందోబస్తు
అల్లిపురం: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి 9,500 సివిల్ పోలీసులు, 2 వేల మంది ఏఆర్ సిబ్బంది, బయట నుంచి 10 వేలకు పైగా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బీచ్ రోడ్డులో 26 కి.మీ మేర ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు, ఏయూలో జరగనున్న యోగా డే వేడుకలకు 5 లక్షల మంది పాల్గొంటారన్నారు. ఇందులో భాగంగా 20వ తేదీ మధ్యాహ్నం నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు, పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు. విజయనగరం నుంచి వచ్చే బస్సులు బోయపాలెం వైపు, అల్లూరి జిల్లా నుంచి వచ్చే బస్సులు వేపగుంట వైపు నుంచి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితులపై ఇటీవల విడుదల చేసిన అస్త్రం యాప్ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఐఎన్ఎస్ చోళ, ఆంధ్ర యూనివర్సిటీ మైదానం, కాళీమాత ఆలయం, ఐఎన్ఎస్ కళింగ సమీపంలో 5 కిలో మీటర్లు పరిధిలో డ్రోన్లు నిషేధించినట్లు వివరించారు.
20వ తేదీ మధ్యాహ్నం నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పొలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి