
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మహారాణిపేట: అధికారులు సమన్వయంతో పనిచేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో యోగాంధ్ర విధుల ప్రత్యేక అధికారులు, పోలీస్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బస్సుల ఏర్పాటు, ప్రజలు, విద్యార్థుల తరలింపు, పార్కింగ్, ట్రాఫిక్, పారిశుధ్యం తదితర ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసే ప్రజలు, విద్యార్థులను జాగ్రత్తగా తీసుకురావడం, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా కేటాయించిన స్థలాలకు చేర్చి, తిరిగి క్షేమంగా వారిని గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, అనకాపల్లి జిల్లాల నుంచి వచ్చే ప్రజలను వారికి కేటాయించిన బ్లాకులకు నేరుగా తరలించాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో మైక్, లైటింగ్ ఏర్పాటు చేసి, రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, రవాణా శాఖ సిబ్బందిని నియమించాలన్నారు. ప్రతి బస్సుపై సంబంధిత సచివాలయం వివరాలు తెలిసేలా బ్యానర్ తప్పనిసరన్నారు. యోగా నిర్వహించే ప్రదేశాలకు దగ్గర్లోని పబ్లిక్ టాయిలెట్స్, వివిధ హోటల్, రెస్టారెంట్స్ చెందిన టాయిలెట్స్ను ప్రజలు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. వాహనాల రాకపోకల పర్యవేక్షణ, వాహనాల మెయింటనెన్స్కు సంబంధించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, టాయిలెట్స్, పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో డీజీపీ హరీష్కుమార్ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
యోగా దినోత్సవ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు