
కందిపప్పు.. ఎప్పుడో చెప్పు?
● రేషన్ డిపోల్లో పంపిణీ చేయని కూటమి ప్రభుత్వం ● నిరాశలో లబ్ధిదారులు
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరతాయని.. రేషన్ షాపుల్లో నిత్యావసరాలన్నీ అందుబాటులోకి వస్తాయని ఆశించిన పేద, మధ్యతరగతి ప్రజలకు నిరాశే మిగులుతోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా.. ఈ జూన్లో కూడా రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ కాలేదు. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదార మినహా ఇతర సరకుల జాడలేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు కందిపప్పు, రాగిపిండి, వంటనూనె వంటివి అందిస్తామని హామీలు గుప్పించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలికొదిలేశారని, కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికీ కిలో కందిపప్పును అందించేవారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కానీ కూటమి సర్కార్ పాలనలో గత 12 నెలలుగా కందిపప్పు సరఫరా అడపాదడపాగా మారి.. ఇప్పుడు పూర్తిగా నిలిచిపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లా పౌరసరఫరాల శాఖ పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పెందుర్తి, గాజువాక వంటి ప్రాంతాల్లో 5,12,619 తెలుపు రేషన్ కార్డులు ఉన్నాయి. 625 చౌకధరల దుకాణాల ద్వారా వీరికి సరకుల పంపిణీ జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, నిత్యావసరాలన్నీ పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని.. ముఖ్యంగా కందిపప్పును వచ్చే నెల నుంచైనా అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.