
మెట్రో మొదటి దశ పనుల పరిశీలన
మహారాణిపేట: విశాఖపట్నంలో మెట్రో రైలు విస్తరణ, అభివృద్ధిలో భాగంగా మొదటి దశ పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారిడార్ 1, 2, 4 నిర్మాణ ప్రాజెక్టు 46.23 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని రెవెన్యూ భూసేకరణ అధికారులు సోమవారం పరిశీలించారు. మెట్రో ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ నిమిత్తం సమగ్ర నివేదికను రూపొందించడానికి కలెక్టర్ సోషల్ ఇంపాక్టు అసెస్సెమెంటు(ఎస్ఐఏ) కమిటీని నియమించారు. ఈ కమిటీ సోమవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి వివరాలను సేకరించి నివేదిక తయారీలో నిమగ్నమైంది. మెట్రో పథకం కోసం గాజువాక, గోపాలపట్నం మండలాల్లోని పలు గ్రామాలతో పాటు విశాఖ నగరం, విశాఖ గ్రామీణ మండలం, విశాఖ జోన్–3, జోన్–4, జోన్–5లలోని నిర్దిష్ట వార్డుల నుంచి భూములను ఎంపిక చేశారు. మొత్తం 9.22 ఎకరాల పట్టా భూమితో పాటు, అదనంగా 87 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించాల్సి ఉంది. నూతన భూసేకరణ చట్టం 2013 ప్రకారం, భూసేకరణకు ముందుగా సామాజిక ప్రభావ అంచనా నివేదికను తప్పనిసరిగా తయారు చేయాలి. ఈ నివేదిక రూపకల్పనకు నియమించిన బృందంలో మెట్రో ప్రాజెక్టు డిప్యూటీ తహసీల్దార్ పద్మావతి, సర్వేయర్ శ్రీనుబాబు, ఎస్ఐఏ సామాజిక నిపుణులు పి.దేవరాజ్, సభ్యులు శ్రీనివాస్, మెట్రో రైలు ప్రాజెక్టు ఇంజనీర్ లక్ష్మణ్, రెవెన్యూ సిబ్బంది, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. భూసేకరణకు అవసరమైన భూములను, అలాగే నష్టపోయే గృహ, వ్యాపార నివాసాలను బృందం పర్యవేక్షించింది. నిర్వాసితులను నేరుగా కలిసి వారి సామాజిక, ఆర్థిక, సాంఘిక స్థితిగతులను తెలుసుకుని, వారి వివరాలను నమోదు చేసుకునేందుకు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.