
ఐదు నెలల నిరీక్షణకు తెర
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కు దాదాపు ఐదు నెలల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం సోమవారం నూతన కమిషనర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడంతో పాలనలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన కేతన్ గార్గ్ (రాజస్థాన్కు చెందిన 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి) జీవీఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా, విజయనగరం, రాజాంపేటలో వివిధ హోదాల్లో గార్గ్ పనిచేశారు.
అస్తవ్యస్త పాలన గాడిన పడేనా?
దాదాపు 20 లక్షలకు పైబడిన జనాభా, 98 మంది కార్పొరేటర్లు, ఎనిమిది జోన్లతో కూడిన జీవీఎంసీకి ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కలెక్టరేట్ విధులు, జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా ఫైల్స్ నిలిచిపోవడంతో పాటు, నగర పౌరులకు సేవలు సక్రమంగా అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయి అధికారులు తూతూ మంత్రంగా విధులు నిర్వహించడంతో పనులు అరకొరగా సాగాయి. అధికారులను నిలదీసే పాలకవర్గం కూడా మొక్కుబడిగా పాలన సాగిస్తోందని కౌన్సిల్ సభ్యులే గతంలో వాపోయారు.
ప్రభుత్వంపై ఒత్తిడి, కలెక్టర్కు ఉపశమనం
ఇటీవల నిర్వహించిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ను నియమించాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. కీలకమైన కమిషనర్ పోస్టును నెలల తరబడి భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కూడా జీవీఎంసీకి ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడం దౌర్భాగ్యమని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే కమిషనర్ను నియమించేలా చూడాలని అన్నారు. ఈ నేపథ్యంలో నూతన కమిషనర్ నియామకంతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ కొంత ఉపశమనం పొందారని పలువురు అధికారులు చెబుతున్నారు.
జీవీఎంసీ కమిషనర్గా కేతన్గార్గ్