దోమ: పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్రావు సూచించారు. మంగళవారం శివారెడ్డిపల్లి రైతు వేదికలో అర్కా ఎప్పిసి ఆధ్వర్యంలో వాసన్, ఎల్డీసీ, కారుణ్య సేవా సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎల్డీసీ ప్రతినిధులు అఖిలేష్, కార్తీక్ రైతులకు పురుగు గుర్తింపు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. పత్తి పంట 45 రోజుల దశ నుంచి లింగాకర్షణ బుట్టలతో నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. వరుసగా మూడు రోజులు బుట్టల్లో ఎనిమిది తల్లి పురుగులు కనిపిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం లింగాకర్షణ బుట్టల ఏర్పాటు, వినియోగంపై రైతులకు డెమో నిర్వహించి బొంపల్లి, బాసుపల్లి, గూడూరు గ్రామాలకు చెందిన రైతులకు లింగాకర్షణ బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం కారుణ్య సంస్థ ప్రతినిధి మధుసూదన్రావు మాట్లాడుతూ... రైతుల ప్రయోజనం కోసం మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎల్డీసీ అసిస్టెంట్ మేనేజర్ అఖిలేష్, వాసన్ ప్రతినిధులు సత్యం, గోపాల్, ప్రేమ్, నరేశ్, సుష్మిత, మోహన్, తిరుమలేశ్, విష్ణుమూర్తి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్రావు


