కుక్కల బారి నుంచి
తప్పించుకునే క్రమంలో..
యాలాల: కుక్కలు వెంట పడటంతో తప్పించుకునే క్రమంలో ఓ జింక ఇంట్లోకి ప్రవేశించింది. ఈ ఘటన బుధవారం ఉదయం మండలంలోని అడాల్పూర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ జింక గ్రామ శివారులోకి వచ్చింది. ఐదు కుక్కలు వెంటపడ్డాయి. తప్పించుకునే క్రమంలో గ్రామానికి చెందిన గజ్జల బాలప్ప ఇంట్లోకి దూరింది. గమనించి సర్పంచ్ రక్మిణి గౌడ్ భర్త మొగులప్ప, మాజీ సర్పంచ్ బోయిని శేఖర్ కుక్కలను తరిమేశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చి జింకను అప్పగించారు.
స్పీకర్ను కలిసిన
కాంగ్రెస్ నాయకులు
ధారూరు: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను బుధవారం కాంగ్రెస్ పార్టీ ధారూరు పట్టణ కమిటీ నూతన అధ్యక్షుడు తిరుపతిగారి మల్లేశం, సభ్యులు నగరంలో కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని స్పీకర్ అభినందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి బాబాఖాన్, నాయకులు సంగమేశ్వర్, కుమ్మరి సాయికుమార్, బుజ్జయ్యగౌడ్, శ్రీనివాస్రెడ్డి, సాయి, దామోదర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అరెస్టులు చట్టవిరుద్ధం
యాలాల: జిల్లాలోని ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడం దారుణమని కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పలి మల్కయ్య, మైనార్టీ హక్కుల పోరాట సమితి ప్రతినిఽఽధి సాధిక్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య అన్నారు. బుధవారం యాలాల పీఎస్ ఎదుట అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాము ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తే అక్రమంగా అరెస్టు చేసి భయాందోళనకు గురి చేయడం తగదన్నారు.
పైలెట్కు ఊరట
తాండూరు: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ నగరం విడిచి వెళ్లకుండా న్యాయస్థానం ఆయనకు విధించిన ఉత్వర్వులను బుధవారం తొలగించింది. దీంతో రోహిత్రెడ్డి ప్రజల్లోకి రానున్నారని బీఆర్ఎస్ తాండూరు శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మార్చి 14న తన ఫాంహౌస్లో ఏర్పాటు చేసిన పార్టీలో డ్రగ్స్ వినియోగించారనే అభియోగంపై రోహిత్రెడ్డి 44 రోజుల పాటు రిమాండ్ ఉన్నారు. ఏప్రిల్ 28న షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చారు. కోర్టు రేడియస్ పరిధిలోని అరవై కిలోమీటర్లు దాటి వెళ్లకుండా నిబంధన విధించింది. దీంతో ఆయన మణికొండలోని తన నివాసంలో ఉన్నారు. వచ్చే నెల మొదటి వారంలో తాండూరులో పర్యటించనున్నట్లు పైలెట్ స్పష్టం చేశారు.
హయత్నగర్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం ఏడు ఖాళీల్లో బీబీఏ–2, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–3, సంస్కృతం–1, స్టాటిస్టిక్స్–1 ఖాళీలు ఉన్నాయని, సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం(ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) మార్కులతో పీజీ పొందిన వారు అర్హులన్నారు.


