–ప్రమాదకర బైక్ విన్యాసాలతో యువకుల హల్చల్
రేణిగుంట: తిరుపతి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను రేణిగుంటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన అభిమానులు మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకల పేరుతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో వివిధ హాస్పిటల్స్, విద్యాసంస్థలు ఉన్నాయి. ఉదయం నుంచే అధిక శబ్దంతో స్పీకర్లు పెట్టి పాటలు పెట్టడంతో ఆ ప్రాంతం లోని పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు, హాస్పిటల్లో ఉన్న రోగులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాండ్ వాయిద్యాలు, బాణసంచా పేల్చడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రోడ్ల పైన యువత ద్విచక్ర వాహనాలతో అధిక వేగంతో ర్యాలీగా రావడం, రోడ్ల పైన బైకులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడంతో ఇతర వాహనదారులు ఆందోళన చెందారు. పట్టణంలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్న సమయంలో ఈ విధంగా భారీ ఎత్తున ర్యాలీలు, జన్మదిన వేడుకల పేరుతో హంగామా సృష్టించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతమంతా బీభత్సం సష్టించారని, ఇలాంటి వాటికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.


