తిరుపతి రూరల్: మహిళల డిజిటల్ సాధికారతను వేగవంతం చేయడం ద్వారానే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవచ్చని నిపుణులు స్పష్టం చేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం విజయవంతంగా ముగిసింది. ముగింపు సందర్భంగా మహిళల డిజిటల్ సమ్మిళితతను బలోపేతం చేసే 9 కీలక సిఫార్సులను దేశ వ్యాప్తంగా సదస్సుకు హాజరైన నిపుణులు ఏకగ్రీవంగా ఆమోదించారు. మహిళా విశ్వ విద్యాలయం మహిళా అధ్యయన కేంద్రం, ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్, సర్వోదయ మహిళా సంక్షేమ సంఘంల సంయుక్త ఆధ్వర్యంలో ‘సుస్థిర అభివృద్ధి కోసం మహిళల డిజిటల్ సమ్మిళితతకు జీవితాంత విద్య – సమస్యలు మరియు వ్యూహాలు’ అనే అంశంపై సావేరి సెమినార్ హాల్లో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో 7 సాంకేతిక సెషన్లు, ఒక ప్లీనరీ సమావేశం, మూడు ప్యానెల్ చర్చలు నిర్వహించగా, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి పైగా పరిశోధకులు, విద్యావేత్తలు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. సదస్సు డైరెక్టర్ డా. డి.ఉమాదేవి నివేదికను సమర్పించగా, కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్ డీన్, మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి పరిశోధనా పత్రాలు సమర్పించిన ప్రతినిధులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. సెమినార్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ పి.ఆదినారాయణరెడ్డి, ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ప్రతినిధులు, సర్వోదయ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు, మహిళా అధ్యయన కేంద్రం అధ్యాపకులు పాల్గొన్నారు.


