ఏర్పేడు: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో 6 రోజుల పాటు ఏక్ భారత్ –శ్రేష్ట భారత్ యువ సంఘం–6 కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. శనివారం ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఏక్ భారత్ –శ్రేష్ట భారత్ యువ సంఘం–6 కార్యక్రమాన్ని ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సంపూర్ణ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఏక్ భారత్ శ్రేష్ట భారత్లో భాగంగా యువ సంఘం ఆరు రోజుల కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన సుమారు యాభై మంది గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నారన్నారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ రెండేళ్ల కిందట తిరుపతి ఐఐటీ ఆధ్వర్యంలో యూత్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ నిర్వహించామని, ఆ సమయంలో అరుణాచల్ప్రదేశ్ ఐఐటీ నుంచి విద్యార్థులు వచ్చారన్నారు.


