శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సొమశిల ప్రాజెక్టు నుంచి
ఇసుక అక్రమ రవాణా
చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడు, కర్ణాటకకు తరలింపు
పూతలపట్టు, చిత్తూరు నగర
శివార్లలో డంప్లు
పోలీసుల దాడితో వెలుగులోకి
టిప్పర్ స్వాధీనం, డ్రైవర్, క్లీనర్ అరెస్టు
రవాణాలో తిరుపతిలోని ఓ ప్రధాన ఆలయ చైర్మన్ బంధువులే కీలకం
సోమశిలలో
కూటమి నేతలు అధికారం అండతో అక్రమ వ్యాపారాలు జోరుగా సాగిస్తున్నారు. ఇసుక, గ్రావెల్, మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమశిల ప్రాజెక్టులో ఇసుకను తవ్వి చిత్తూరు మీదుగా తమిళనాడు, కర్ణాటకకు రవాణా చేస్తున్నారు. పూతలపట్టు, చిత్తూరు నగర శివార్లలో డంప్ చేసి రాత్రిళ్లు టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. పూతలపట్టు పోలీసులు కాపుకాచి టిప్పర్లను పట్టుకోవడంతో అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో తిరుపతికి చెందిన ఓ ప్రధాన ఆలయ చైర్మన్ బంధువులే ప్రధాన భూమిక పోషిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
సాక్షి టాస్క్ఫోర్స్ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని గుడిపాల మీదుగా తమిళనాడులోని కాట్పాడి, బంగారుపాళెం, పలమనేరు మీదుగా కర్ణాటకకు తరలుతోంది. పూతలపట్టు, చిత్తూరు నగర శివార్లలో డంప్లు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి రాత్రిళ్లు టిప్పర్లతో సరిహద్దు రాష్ట్రాలకు తరలించడం ఈ మాఫియా స్టైల్ ఆపరేషన్గా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మాఫియాకు ముందస్తు సమాచారం, రూట్ క్లియరెన్స్ ఇచ్చే వ్యవస్థీకృత నెట్వర్క్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో తిరుపతిలోని ఓ ప్రధాన ఆలయ చైర్మన్ బంధువుల పాత్ర ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే పేరుతో ఇసుక వ్యాపారం నడిపిస్తూ, మధ్యవర్తులు, ట్రాన్స్పోర్ట్ యజమానుల ద్వారా భారీగా డబ్బు చేతులు మారుతోందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని ధర్మపురికి చెందిన మరో కీలక వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.
కూటమి నేతల
ఆదాయ వనరుగా సోమశిల
కాపు కాచి పట్టేశారు
పోలీసులు శనివారం తెల్లవారుజామున పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ వద్ద టిప్పర్ను పట్టుకున్నారు. పరిశీలనలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తేలింది. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఇసుకను నెల్లూరు వైపు నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారులు ఇంకా వెలుగులోకి రాకపోవడంతో విచారణ మరింత వేగవంతమైంది. ఇప్పటికే కొందరి పేర్లు అనుమానితుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగించే ఈ అక్రమ ఇసుక రవాణా వెనుక ఉన్న ‘‘పెద్ద తలలు’’ బయటపడతాయా? లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


