తిరుపతి తుడా: స్థానిక ఆర్సీ రోడ్డులోని ఈఎస్ఐ ఆస్పత్రిని ఇన్సూరెనన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ రాయలసీమ రీజియన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆమె డాక్టర్లతో మాట్లాడుతూ డిస్పెన్సరీల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు డిస్పెన్సరీలకు వచ్చే అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈఎస్ఐ వైద్య సేవలను లబ్ధిదారులకు చేరువచేసేందుకు సంస్థలు పనిచేసే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టాలని చెప్పారు. అనంతరం సిబ్బంది హాజరు, ఫార్మసీ రిజిస్టర్లను, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు.
ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, వేలూరు జిల్లా, ఆర్కాట్ తాలూకా, మస్సురుపాళేనికి చెందిన సి.నాగరాజన్కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2017లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం తిరుపతి, చైన్నె రోడ్డు, గాజుల మండ్యం జంక్షన్ సమీపంలో తనిఖీ చేసింది. నిందితుడు నాగరాజన్ లారీలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుపడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.


