ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కొడుకు ప్రసన్నకుమార్రెడ్డి స్థలాన్ని కబ్జా చేసేందుకు వెళ్లారు.
టీవీఎస్ షోరూం సమీపంలో 14వ వార్డులో జనసేన అధ్యక్షుడు, మరి కొందరు రూ.9 కోట్లు విలువ చేసే భూమి కబ్జా?
తిరుమల బైపాస్ ఎస్కే ఫాస్ట్ఫుడ్ హోటల్ సమీపంలోని విలువైన ఇంటి స్థలంపై టీడీపీ నాయకుడు కంకణాల రజనీకాంత్నాయుడు కన్నుపడింది. ఈ విషయంపై బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై దీక్షలు కూడా చేశారు.
45వ వార్డు అయ్యప్పకాలనీలో ఎమ్మెల్యే పీఏ ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకునేందుకు గోడను పడగొట్టారు.
కపిలతీర్థం రోడ్డు ఎస్బీఐ పక్కన ఉన్న కోట్ల విలువైన భూమి ఆక్రమణకు జనసేన నాయకులు, గుండాల ప్రయత్నం?
ఎంఆర్పల్లిలో శ్మశాన స్థలాన్ని మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ప్రోద్బలంతో ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
ఉపాధ్యాయనగర్లో టీడీపీ నాయకుడి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
మామిడికాయల మండీ వద్ద ఒకటిన్నర ఎకరాల భూమి ఆక్రమణలో జేబీ శ్రీనివాసులు పాత్ర తెలిసిందే.
దౌర్జన్యాలకు పాల్పడుతున్న
టీడీపీ గుండాలు
వైఎస్సార్ సీపీ పిలుపుతో
భారీగా తరలివచ్చిన బాధితులు
బాధితులకు అండగా ఉంటామని భూమన అభినయ్రెడ్డి భరోసా
బాధితులు తమను కలవాలని పిలుపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతిలో కూటమి నేతలు చేస్తున్న భూ ఆక్రమణలు, దౌర్జన్యాలపై వైఎస్సార్ సీపీ ఉద్యమాలకు సిద్ధమైంది. నగరంలోని శివజ్యోతినగర్ పరిధిలోని ఎర్రమిట్టలో గురువారం వైఎస్సార్ సీపీ మెరుపు ధర్నా చేపట్టింది. వారం రోజుల క్రితం పచ్చ గుండాలు రూ.కోట్ల విలువైన వివాదాస్పద భూమిలోకి ప్రవేశించి ఆక్రమించుకునేందుకు యత్నించిన విషయం తెలిసిందే. కూటమి గుండాల దౌర్జన్యంపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతటితో వదిలేయకుండా గురువారం ఉదయం శివజ్యోతినగర్లోని ఎర్రమిట్టలో భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన నగరంలోని కూటమి బాధితులు, మహిళలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా బైఠాయించారు. భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ శాప్ చైర్మన్ రవినాయుడు, జేబీ శ్రీనివాసులు సహకారంతో గుండాలు రెచ్చిపోయి తులసమ్మ, మరికొందరిని పక్కకు ఈడ్చేసి భూ ఆక్రమణకు యత్నించారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలకు అనుకూలంగా ఉన్న కొందరు జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి, వారి ముసుగులో మొత్తం భూమిని కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను కొట్టడంతోపాటు కేసులు పెడుతున్నా తాము పట్టించుకోలేదన్నారు. పేదల జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. తులసమ్మ అనే వృద్ధురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సగటు పేదవారికి అండగా నిలబడతామని తెలిపారు. కూటమి నేతల బాధితులు ఎవరైనా ఉంటే మమ్మల్ని కలవాలని, అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగరంలో కూటమి నేతలు ఎక్కడెక్కడ భూములు స్థలాలు ఆక్రమించారంటే..
తిరుపతి నగరంలో
విచ్చలవిడిగా భూ ఆక్రమణలు


