సంతకం.. భాగ్యనగరం
వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయం పనితీరే సపరేట్ అనారోగ్య కారణాలతోసెలవుపై వెళ్లిన ఎంపీడీఓ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించని ప్రభుత్వం ఇబ్బందిపడుతున్న ప్రజలు
అన్ని ఎంపీడీఓ కార్యాలయాల తీరు ఒక రకంగా ఉంటే.. వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయ పనితీరే సపరేట్గా ఉంది. ఎంపీడీఓ సంతకం కావాలంటే భాగ్యనగరం బాట పట్టాల్సిందే.. మండల ఎంపీడీఓ అనారోగ్య సమస్యలతో సెలవు పెట్టడంతో మరొకరి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఎంపీడీఓ హైదరాబాద్లో ఉండడంతో అక్కడికి వెళ్లి సంతకాలు తీసుకొస్తున్నారు. ప్రతి చిన్న పనికీ అంతదూరం వెళ్లలేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది.
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయం పనితీరు రోజురోజుకు విమర్శలకు దారి తీస్తోంది. ఆ కార్యాలయానికి సంబంధించి ఎంపీడీఓ సంతకం అవసరమైతే పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల 14 నుంచి ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయమ్మ అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లింది. దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తే మండలంలో జరగాల్సిన అభివృద్ధి పనులు, ఇతర కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం తలెత్తదు. అయితే ఆ దిశగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో అధికారికంగా మండల ఎంపీడీఓకు కేటాయించిన ఫోన్ నంబర్ సైతం సెలవులో ఉన్న ఎంపీడీఓ వద్దనే ఉండడం, ఆ ఫోను అందుబాటులో లేకపోవడంతో కనీసం కార్యాలయానికి సంబంధించి సమా చారం కూడా ఇవ్వలేని పరిస్థితి. అన్నిరకాల కార్యక్రమాలకు జనం ఇబ్బందిపడుతున్నారు. తాజాగా కొన్ని ఫైళ్లకు సంబంధించి అత్యవసరంగా ఎంపీడీఓ సంతకాలు అవసరం కావడంతో కార్యాలయానికి చెందిన ఉద్యోగి రెండు రోజుల కిందట హైదరాబాద్కు వెళ్లి మరీ సంతకాలు చేయించుకుని వచ్చినట్లు సమాచారం. వరదయ్యపాళెం మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్లో నివాసముంది. దీంతో సెలవులో ఉన్న ఆమె హైదరాబాద్లో ఉండడంతో ఆమె సంతకాలు అవసరమైతే హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తుంది.
ఇన్చార్జి బాధ్యతలు అప్పగింతలో నిర్లక్ష్యమెందుకో?
వరదయ్యపాళెం ఎంపీడీఓ ఈ నెల 14 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు సెలవుపై వెళ్లినట్లు సమాచారం. అయితే అన్ని రోజుల పాటు ఆమె సెలవుపై వెళ్లడంతో ఎంపీడీఓగా మండల పరిషత్ పాలన ప్రశ్నార్థకంగా మారింది. మండల అభివృద్ధి అధికారిగా రోజువారీ వారి పర్యవేక్షణ ఎంతో కీలకం. అంతటి కీలకమైన అధికారి పోస్టుకు సంబంధించి రెండు వారాలకు పైగా సెలవుపై వెళ్లినప్పటికీ ఆ బాధ్యతలను ఇన్చార్జికి అప్పగించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారిక ప్రజాప్రతినిధులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇన్చార్జి బాధ్యతలను మరో అధికారికి అప్పగించాలని కోరుతున్నారు.


