వైఎస్సార్ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
సుభాష్ నగర్: పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అందరి ముందు లేకపోవడం బాధాకరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం ప్రెసిడెంట్ వై. ఈశ్వరప్రసాద్రెడ్డి అన్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని గాజులరామారం, మహాదేవపురంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద బుధవారం వైఎస్సార్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు అనంతపురం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల, వైఎస్సార్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈశ్వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో పేదలకు చేసిన సేవలను కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో వై.ఎస్. జగన్ నడుస్తున్నారని చెప్పారు. శివరామిరెడ్డి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి లేకపోయినా సంక్షేమ పథకాల రూపంలో ఆయన నిరంతరం అందరికీ కనిపిస్తున్నారన్నారు.
లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తండ్రి బాటలో వై.ఎస్. జగన్ నడుస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సేవా సంఘం అధ్యక్షుడు పుట్లూరు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ నాయకులు సాతాల గోపాల్, గంగిరెడ్డి సూర్య ప్రకాశ్రెడ్డి, వెంకటస్వామిరెడ్డి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, వెంకట్రెడ్డి, సురేంద్రరెడ్డి, ప్రవీణ్రెడ్డి, రాంభూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
మంత్రులు పొన్నం, వాకిటి, అడ్లూరి నివాళి
పంజగుట్ట (హైదరాబాద్): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పంజగుట్ట కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి బుధవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ఘనంగా నివాళులర్పించారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయని మంత్రులు తెలిపారు.
వైఎస్సార్ ప్రజలతో మమేకమై, వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసిన ప్రజానాయకుడని మంత్రులు పేర్కొన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయన్నారు. వైఎస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు.


