ఫోర్టిఫైడ్‌ బియ్యంలో ఎన్ని విటమిన్లో! క్వింటాకు కిలో చొప్పున.. ఎలా తయారు చేస్తారో తెలుసా?

What Is Fortified Rice And How is It Prepared Here Full Details - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: కరోనా వైరస్‌ ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధిక పోష కాలు ఉన్న బియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా అందించాలని నిర్ణయించింది. పోషక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌)ను ఎఫ్‌సీఐ ద్వారా సేకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు సహకారం అందిస్తోంది.

బియ్యంలో కృత్రిమంగా సూక్ష్మ పోషకాలు కలపటంతో ఆ ఆహారం తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా కరోనాలాంటి పలురకాల వైరస్‌లను మానవులు తట్టుకుంటారని భావిస్తున్నారు. ఫోర్టిఫైడ్‌ రైస్‌ తయారీకి జిల్లాలోని రైస్‌మిల్లుల్లో యంత్రాలను మార్చాలని యజమానులకు అధికారులు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఏప్రిల్‌లో సరఫరా చేయగా.. రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులు, రేషన్‌ లబ్ధిదారులకు కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.  
చదవండి👉🏻Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే

బ్లెండింగ్‌ యూనిట్ల ఏర్పాటు.. 
2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆహార సంస్థ అందించిన నిల్వలకు అదనంగా పోషకాలు కలుపుతున్నారు. ఇందుకు మిల్లుల్లో బ్లెండింగ్‌ యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు సుమా రు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. జిల్లాలోని 10 పారా బాయిల్డ్‌ రైస్‌మిల్లుల్లో వీటిని ఏర్పాటుచేసి అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 700 క్వింటాళ్ల ఫోర్టిఫైడ్‌ నిల్వలను సరఫరా చేస్తున్నారు. మరో అయిదు మిల్లుల్లో బ్లెండింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి బియ్యంలో ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌–ఏ, జింక్, ఇతర విటమిన్లు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021 యాసంగిలో పౌరసరఫరాలశాఖ సేకరించిన ధాన్యం 7,540 మెట్రిక్‌ టన్నులు ఈ మిల్లులకు కేటాయించగా.. ఫోర్టిఫైడ్‌ రైస్‌ పౌరసరఫరాలశాఖ గోదాములకు చేరింది. 

ఉపయోగం ఏంటి? 
సాధారణ బియ్యంలో ఐరన్‌ విటమిన్‌ డి, బి–12తో పాటు మరిన్ని పోషకాలు కలపటంతో సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యంగా మారుతాయి. గోధుమలు, మినుములు, పెసర, అపరాలు, రాగులు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను పొడిగా మారుస్తారు. వీటిని కెనరల్స్‌ అంటారు. ఈ కెనరల్స్‌ పౌడర్‌ను ముద్దల రూపంలోకి మార్చి క్వింటా సాధారణ బియ్యానికి కిలో కెనరల్స్‌ కలుపుతారు. సాధారణ బియ్యంలో కార్బొహైడ్రేట్స్‌ మాత్రమే ఉంటాయి. తోడుగా కెనరల్స్‌ కలపటంతో పిండి పదార్థాలు, పోషకాలు జమవుతాయి. పోషకాలు కలిపిన బియ్యం వండితే బలవర్ధక ఆహారం తయారవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  

క్వింటాకు కిలో చొప్పున.. 
వంద కిలోల సాధారణ బియ్యానికి కిలో పోషకాల నిల్వలను కలుపుతున్నారు. మిల్లుల్లో ఓవైపు మరపట్టిన.. మరోవైపు పోషకాల నిల్వలు వచ్చి ఒకేచోట పడేలా యంత్రాలను అమర్చుతున్నారు. 

ఉత్తర్వులు రావాలి.. 
పోషకాల మిళిత బియ్యాన్ని ఇప్పటికే అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మున్ముందు పాఠశాలలలు, రేషన్‌ లబ్ధిదారులకు అందిస్తాం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది. 
– జగదీశ్‌కుమార్, మేనేజర్, పౌరసరఫరాల శాఖ, మహబూబ్‌నగర్‌

చదవండి👇🏽
కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top