గ్రీవెన్స్కు మళ్లీమళ్లీ వస్తున్న బాధితులు
వినతి పత్రాలు తీసుకుంటున్న అధికారులు
హామీలతో సరిపెడుతున్న వైనం
దరఖాస్తుల్లో అధికం భూసమస్యలు, ఇళ్లవే
‘ప్రజావాణి’పై సాక్షి ‘గ్రౌండ్ రిపోర్టు’
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేలు.. క్రమంగా ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాలుగా మాత్రమే మారుతున్నాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సమస్య చెప్పేందుకు ఒకసారి వచ్చిన బాధితుడు.. పరిష్కారం కాకపోవడంతో మళ్లీ రావడం, మరోసారి వినతిపత్రం ఇవ్వడం.. ఇలా అదే సమస్యతో కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు పలు జిల్లాల్లో కనిపిస్తున్నాయి.
ఒకే సమస్య.. మళ్లీ మళ్లీ అదే గోడు
గ్రీవెన్స్డేలో కొత్తగా వచ్చే ఫిర్యాదులతోపాటు గతంలోనూ ఇదే సమస్యపై ఫిర్యాదు చేసినవారు తిరిగి వస్తున్న ఉదంతాలు ఉన్నాయి. భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు, పింఛన్లు, రేషన్కార్డులు, ప్రభుత్వ పథకాల అమలు, రహదారులు, విద్యుత్ తదితర అంశాలపై ఫిర్యాదులు పునరావృతమవుతున్నాయి. ‘ఇంతకుముందు ఫిర్యాదు చేశాం.. పరిష్కారం కాలేదు. అందుకే మళ్లీ వచ్చాం’అని పలువురు బాధితులు చెబుతున్న పరిస్థితి అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
వినతిపత్రం తీసుకున్నారు.. అంతేనా?
గ్రీవెన్స్డేలో బాధితుడి నుంచి వినతిపత్రం తీసుకొని, దానిని సంబంధిత అధికారికి పంపడం సాధారణ ప్రక్రియగా మారింది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఫిర్యాదుపై విచారణ జరిగిందా? బాధితు డికి సమాచారం ఇచ్చారా? సమస్య పరిష్కారమైందా? అన్నది చాలాచోట్ల స్పష్టంగా తెలియడం లేదు. ఫిర్యాదు ఏ శాఖకు వెళ్లింది? ఎవరు విచారణ చేయాలి? ఎప్పటిలోగా పరిష్కరించాలి? అన్న వివరాలు బాధితుడికి అందుతున్నాయా? అన్నది కూడా పరిశీలించాల్సిన అంశంగా మారింది.


