ఎక్సైజ్‌ శాఖ జోలికి వస్తే కఠిన చర్యలు | Tributes paid to the body of Constable Soumya at Gandhi Mortuary | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ శాఖ జోలికి వస్తే కఠిన చర్యలు

Feb 2 2026 2:40 AM | Updated on Feb 2 2026 2:40 AM

Tributes paid to the body of Constable Soumya at Gandhi Mortuary

ఆయుధాలు ఇచ్చే నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది: మంత్రి జూపల్లి

గాంధీ మార్చురీ వద్ద కానిస్టేబుల్‌ సౌమ్య పార్థీవ దేహానికి నివాళి 

రూ.కోటి నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, సర్వీస్‌ కాలం వరకు వేతనం  

కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జూపల్లి

గాంధీఆస్పత్రి/బాన్సువాడ: ఎక్సైజ్‌ శాఖ పోలీసులు, ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్నులో వణుకు పుట్టించేలా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. విధి నిర్వహణలో అసాధారణ తెగువ చూపించి అసువులు బాసిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య భౌతికకాయానికి ఆదివారం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని, ఎక్సైజ్‌ పోలీసులకు ఆయుధాలు అందించే నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎక్సైజ్‌ శాఖ ఉద్యోగుల భధ్రత తమ ప్రథమ కర్తవ్యమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. 

సౌమ్య భౌతికంగా మనమధ్య లేకున్నా ఆమె చూపిన తెగువ, చొరవ, ధైర్యం, వృత్తి నిబద్ధత స్ఫూర్తిదాయకంగా చరిత్రలో మిగిలిపోతుందని, ఆమె కుటుంబసభ్యులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున కోటి రూపాయల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, సౌమ్య సర్వీసు కాలం అంటే ఆమె పదవీ విరమణ పొందే వయసు వరకు వేతనం చెల్లిస్తామని మంత్రి ప్రకటించారు. 

కాగా, తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని సౌమ్య కుటుంబానికి అందించాలని నిర్ణయించారు. గాం«దీమార్చురీలో పోస్టుమార్టం అనంతరం సౌమ్య పార్థీవ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్ధలానికి తరలించారు. 

కార్యక్రమంలో రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ డీజీ షానవాజ్‌ ఖాసీం, ఎక్సైజ్‌ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ యాసిన్‌ ఖురేషీ, ఉప కమిషనర్లు హరికిషన్, అంజన్‌రావు, చంద్రయ్య, ప్రదీప్‌రావు, కృష్ణ ప్రియ, శ్రీనివాస్, నవీన్‌ కుమార్, అంజిరెడ్డి, సోమిరెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి, తెలంగాణ ప్రొహిబిషనరీ అండ్‌ ఆబ్కారీ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్‌ గౌడ్, చంద్ర శేఖర్, విజయ్‌ కుమార్, ప్రవీణ్‌ కుమార్, భరత్, ఏడుకొండలు, గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొ. వాణిలతోపాటు ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి 
సౌమ్య అంత్యక్రియలను ఆమె స్వగ్రామం నిజామాబాద్‌ జిల్లా మోస్రా మండల కేంద్రంలో ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. మంత్రి జూపల్లి ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, సర్పంచ్‌ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంతాపం వ్యక్తం చేసిన సీఎం,పీసీసీ అధ్యక్షుడు
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి పట్ల సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సౌమ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటి దారుణ సంఘటనలు ప్రజాస్వామ్య సమాజానికి మచ్చగా మిగులుతాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతి చెందిన సౌమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement