అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ | Telangana High Court To Hear Avinash Reddy Bail Petition | Sakshi
Sakshi News home page

అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

Apr 28 2023 4:17 PM | Updated on Apr 28 2023 6:29 PM

Telangana High Court To Hear Avinash Reddy Bail Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై  ఈ సమయంలో వాదనలు వినలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హైకోర్టుకు రేపటి నుంచి వేసవి సెలవులు ఉన్నాయని, ఈ రోజు వాదనలు వినిపించినా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి తెలిపారు.

ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు ఇంప్లీడ్ పిటిషనర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ వికాస్ కుమార్ వచ్చారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తరపు వాదనలు విన్న జస్టిస్ సురేంద్ర .. ఇవ్వాళ విచారణ మొదలు కాగానే.. కొన్ని వ్యాఖ్యలు చేశారు.  రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయని, ఈ దృష్ట్యా జూన్‌ 5కు ఈ పిటిషన్ ను వాయిదా వేస్తున్నామని  తెలిపారు. బెయిల్ పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్ లో పెట్టలేమని చెప్పారు.

తెలంగాణ హైకోర్టుకు మే 1 నుంచి జూన్ 2వరకు సెలవులు ఇప్పటికే ప్రకటించారు. ప్రతి గురువారం మాత్రం అత్యవసర కేసుల విచారణ చేపడతారు. దాన్ని బట్టి మే 4,11,18,25, జూన్ 1న ప్రత్యేక కోర్టు నిర్వహణ ఉంటుంది.

దీనిపై స్పందించిన అవినాష్ తరపు న్యాయవాది, తన క్లయింట్ ను సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉందని, ఆ దృష్ట్యా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. సిబిఐ కావాలనుకుంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ కు సహకరిస్తామని తెలిపారు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది.

సమయం తక్కువగా ఉంది కాబట్టి.. అత్యవసరంగా ఉత్తర్వులు కావాలంటే వెకేషన్‌ బెంచ్‌కు పిటిషన్ మార్చుకుంటారా అని జస్టిస్ సురేంద్ర పార్టీలను అడిగారు. మీ విజ్ఞప్తి అత్యవసరమయితే ప్రధాన న్యాయమూర్తి ఎదుట మెన్షన్‌ చేసి అర్జెన్సీ ఉందని చెప్పాలని, దాన్ని బట్టి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ సురేంద్ర స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement