హైదరాబాద్: ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది దీనిలో భాగంగా ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీని కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్, సర్వైలెన్స్ను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజనర్సింహ.
ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై 21 రోజుల పర్యవేక్షణ ఉంచనున్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్కు తరలిస్తారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉన్న ఇద్దరు విదేశీయులకు ఎబోలా వైరస్ నెగిటివ్ వచ్చింది. అయినా రెండోసారి పరీక్షల కోసం శాంపిల్స్ను పుణె పంపారు. అప్పుడు కూడా నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మరొకవైపు విదేశీ ప్రయాణికులు తప్పుడు చిరునామాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద చర్యలకు ఆదేశించారు. ఎయిర్పోర్ట్లోనే చట్టపరమైన హెచ్చరికలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి భాషా సిబ్బంది నియామకానికి కూడా ఆదేశాలు జారీ చేశారు.
EFLU సహకారంతో 24 గంటల భాషా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్కు శాఖల మధ్య సమన్వయం పెంచాలని, ఆరోగ్యశాఖ-జీహెచ్ఎంసీ-పోలీసుల సమన్వయంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ఎబోలా నివారణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటికే ఎబోలా టెస్టింగ్ కిట్లు అందాయని, పరీక్షలు ప్రారంభించామని జాతీయ పరిశోధన సంస్థ సీసీఎంబీ తెలిపింది. శాంపిల్ వచ్చిన వెంటనే ఫలితాలు అందిస్తామని పేర్కొంది.


