సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో 46ను విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయనుంది. పంచాయతీ రాజ్ జీవో 46 ప్రకారం.. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు. రిజర్వేషన్ కేటాయింపునకు Socio-Economic, Education, Employment, Political and Caste Survey (SEEPC) 2024 జనాభా డేటా ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఎస్టీ-ఎస్సీ-బీసీ-మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలి. సర్పంచ్ రిజర్వేషన్కు కోసం 2011 జనగణన + SEEPC డేటా వినియోగించాలి. మునుపటి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయరాదు. వందకు వంద శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయాలి. ఎస్టీ రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి, తరువాత ఎస్సీ నుంచి బీసీ కేటాయింపు జరపాలి. మహిళల రిజర్వేషన్ అన్ని కేటగిరీలలో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేయాలి.
గ్రామ పంచాయతీ/వార్డుల సంఖ్య తక్కువైతే.. మొదట మహిళా ప్రాధాన్యత ఆ తరువాత లాటరీ పద్ధతి పాటించాలి. 2019 ఎన్నికల్లో అమలుకాలేని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చు. వార్డు రిజర్వేషన్ల నిర్ణయం ఎంపీడీవో, సర్పంచ్ రిజర్వేషన్ ఆర్డీవోల ఆధ్వర్యంలో జరగాలి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు & ఎలక్షన్ అథారిటీలను అమలు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.


