
తమకు లేని జబ్బులు ఉన్నాయని తప్పుడు పత్రాలు సమర్పిస్తున్న వైనం
ఉమ్మడి కరీంనగర్లో 30 మంది వారసులకు ఉద్యోగాలు!
రాష్ట్రవ్యాప్తంగా రాకెట్.. రంగంలోకి సీఐడీ
వెటర్నరీ శాఖలో ‘మెడికల్లీ అన్ఫిట్’ స్కాం..
తమ పిల్లలకు ఉద్యోగాల కోసం తండ్రుల నిర్వాకం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మెడికల్ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ మెడికల్ సరి్టఫికెట్లు చూపించి తాము ఇక పనిచేయలేమంటూ.. తమ వారసులకు ఉద్యోగాలు ఇప్పిద్దామనుకున్న ఇద్దరు వెటర్నరీ శాఖ ఉద్యోగుల గుట్టును అధికారులు రట్టు చేయటంతో ఈ స్కాం బయటపడింది. ఈ స్కాం లోతుపాతులను కనిపెట్టేందుకు పోలీసులు కూపీ లాగుతున్నారు. సిరిసిల్ల, కరీంనగర్తోపాటు ఇతర జిల్లాల్లోనూ అక్రమ వారసత్వ నియామకాల రాకెట్ సాగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ వెటర్నరీ శాఖ అధికారునలు సీఐడీకి లేఖ రాశారు. దీంతో సీఐడీ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఎలా బయటపడిందంటే?
వాస్తవానికి ఈ కుంభకోణాన్ని మార్చిలోనే గుర్తించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట మండలాల నుంచి వెటర్నరీ శాఖకు చెందిన ఉద్యోగులు వేర్వేరుగా మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ సమర్పించిన డాక్యుమెంట్లు ఒకేలా ఉండటం, ఇద్దరూ కాలేయ సంబంధిత సమస్యలనే కారణాలుగా చూపించడంతో అధికారులకు అనుమానం వచ్చి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. కరీంనగర్ కేంద్రంగా ఈ రాకెట్ పనిచేసిందని గుర్తించారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు కరీంనగర్కు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ బీరయ్యను సంప్రదించారు. ఆయన వారి నుంచి రూ.3 లక్షల చొప్పున తీసుకొని తనకు డి.ఎం.హెచ్.ఓ ఆఫీస్లో పరిచయం ఉన్న మొహమ్మద్ బాసిద్ హుస్సేన్, ల్యాబ్ టెక్నీషియన్ కొత్తపల్లి రాజేశం సాయంతో కరీంనగర్లోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి ప్ప్రిస్కిప్షన్లతో నకిలీ మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు గుర్తించారు. దీనిపై ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి.
రంగంలోకి సీఐడీ..
ఇదే తరహాలో మెడికల్ అన్ఫిట్ కింద ఉమ్మడి జిల్లాలో 30 మంది వరకు ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. ఈ రాకెట్ సిరిసిల్ల, కరీంనగర్కు మాత్రమే కాకుండా వెటర్నరీ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిందని భావిస్తున్నారు. కుంభకోణం భారీగా కనిపిస్తుండటంతో స్థానిక పోలీసులతో దర్యాప్తు సాధ్యం కాదని భావించి సీఐడీకి లేఖ రాశారు. దీంతో సీఐడీ అధికారులు ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట పోలీసుస్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లు, ప్రాథమికంగా ఉమ్మడి జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుని అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే దర్యాప్తు మొదలుపెట్టనున్నారని అధికార వర్గాల సమాచారం.