మరీ ఇంత బద్ధకమా? | Students negligence in scholarship applications: telangana | Sakshi
Sakshi News home page

మరీ ఇంత బద్ధకమా?

Mar 29 2025 4:51 AM | Updated on Mar 29 2025 4:51 AM

Students negligence in scholarship applications: telangana

ఉపకార దరఖాస్తుల్లో కొందరు విద్యార్థుల తీవ్ర నిర్లక్ష్యం  

ఏడు నెలలు గడువిచ్చినా ఇప్పటికీ దరఖాస్తుకు దూరంగా 1.7లక్షల మంది  

మే 31వరకు దరఖాస్తు గడువు పొడిగించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు ప్రక్రియలో పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు బద్ధకం వీడడం లేదు. దరఖాస్తు కోసం నెలల తరబడి గడువు ఇచ్చినా, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా గడువు తేదీని పలుమార్లు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తు ప్రక్రియ గతేడాది సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రారంభమైంది. ఇంటర్‌ మొదలు, డిగ్రీ, పీజీ, వృత్తివిద్య, సాంకేతిక విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థులు డిసెంబర్‌ 31లోపు ఈపాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు దాదాపు12 లక్షల మంది ఉంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి.

 నాలుగు నెలల పాటు అవకాశం కల్పించినా, సగం మంది విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేదు. దీంతో దరఖాస్తు గడువును మార్చి 31వరకు పొడిగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఏడు నెలల పాటు అవకాశం కల్పించినా, 10.3 లక్షల మంది మాత్రమే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా 1.7లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదని సంక్షేమశాఖలు గుర్తించాయి. కాలేజీ యాజమాన్యాల నుంచి సేకరించిన సమాచారం అధారంగా ఆయా విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు నెలలు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మే 31వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 

కళాశాల యాజమాన్యాల ఉదాసీనత  
పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు దరఖాస్తు చేసుకోవడంలో కళాశాల యాజమాన్యాల బాధ్యత కీలకం. విద్యార్థుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ప్రత్యేకంగా కాలేజీలో ఒక వ్యక్తిని నియమించి ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయించాలి. ఈ మేరకు సంక్షేమ శాఖలు కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నా, ప్రైవేట్‌ కాలేజీలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.  విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారంతా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సంక్షేమశాఖ అధికారులు తాజాగా కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.

దరఖాస్తు ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో వాటి పరిశీలన సైతం ఆలస్యమవుతోందని సంక్షేమ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తయితే కాలేజీల వారీగా పరిశీలన ప్రారంభించి వేగవంతంగా మంజూరు చేయవచ్చని సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో నెలకొన్న జాప్యంతో ముందుకు సాగని పరిస్థితి నెలకొందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. మరోవైపు వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో వారికోసమైనా గడువును పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement