హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ ఏమన్నారంటే.. | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ ఏమన్నారంటే..

Published Tue, Mar 15 2022 10:31 AM

Speaker Not Allowed To Suspended BJP MLAs To TS Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో శాసన సభకు చేరుకున్న సస్పెండెడ్‌ బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ అసెంబ్లీలోకి అనుమతివ్వలేదు. సభ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పీకర్‌ స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు జేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు వెళ్లిపోయారు. తమ అభ్యర్థనను స్పీకర్‌ తిరస్కరిస్తున్నట్లు చెప్పారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. 

కాగా శాసనసభ్యులను సహేతుకమైన కారణాలు లేకుండానే సస్పెండ్‌ చేయడం వారి హక్కులను హరించడమేనని హైకోర్టు సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే . తమను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి కొట్టివేయడంపై.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులు దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది.

ఈ సెషన్‌ మొత్తం సభకు హాజరుకాకుండా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ నిర్ణయానికి సహేతుకమైన కారణాలు లేవని భావిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. సస్పెండైన ముగ్గురు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమావేశాలకు అనుమతించాల్సిందిగా కోరాలని సూచించింది. కార్యదర్శి వీరిని మంగళవారం సభకు ముందే స్పీకర్‌ దగ్గరికి తీసుకెళ్లాలని, వారి అభ్యర్థనను స్పీకర్‌ విని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 

Advertisement
Advertisement