సాఫ్ట్‌వేర్‌ దంపతుల ఆత్మహత్య | software couple passed away: Sangareddy district | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ దంపతుల ఆత్మహత్య

Jan 7 2025 12:38 AM | Updated on Jan 7 2025 12:38 AM

software couple passed away: Sangareddy district

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో ఘటన 

పటాన్‌చెరు టౌన్‌: కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్‌ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన సందీప్‌ (36)కు ఆరేళ్ల కిందట మంచిర్యాలకు చెందిన కీర్తి (34)తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ మియాపూర్‌లో ఉండేవారు. 9 నెలల కిందట అమీన్‌పూర్‌ పరిధిలోని బంధంకొమ్ము శ్రీదామ్‌ హిల్స్‌లో సొంతిల్లు కొనుగోలు చేసి కూతురు గగనహిత(3), కుమారుడు సాకేత్‌రామ్‌ (ఏడాదిన్నర)తో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. సోమవారం పాప గగనహిత పుట్టినరోజు ఉంది.

వేడుక జరిపే విషయంలో 5వ తేదీ (ఆదివారం) ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సందీప్‌ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి మియాపూర్‌ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఒక్కడే ఇంటికొచ్చిన సందీప్‌కు కీర్తి ఉరేసుకొని కనిపించింది. వెంటనే అతడి తండ్రికి ఫోన్‌లో కీర్తి ఉరేసుకుందని విషయం చెప్పాడు. సందీప్‌ తల్లిదండ్రులు అక్కడికి వచ్చేలోపు అతడు కూడా తాడుతో ఉరేసుకున్నాడు. కీర్తి తండ్రి ప్రభాకర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్‌పూర్‌ సీఐ నాగరాజుతోపాటు ఎస్‌ఐ సోమేశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement