సాక్షి, హైదరాబాద్: రామ్నగర్కు చెందిన ఓ రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగిని పెట్టుబడుల పేరుతో రూ.3.29 కోట్లకు ముంచిన హేమంత్ కుమార్పై నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) కేసు నమోదైంది. దొర్నాల రవీందర్ వజీర్ సుల్తాన్ టొబాకో (వీఎస్టీ) కంపెనీ లిమిటెడ్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. దాదాపు రెండేళ్ల క్రితం అదే ప్రాంతంలో నివసించే రామకాంత్ అనే వ్యక్తితో ఈయనకు పరిచయమేర్పడింది. అతని ద్వారా రవీందర్ చిట్ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారు. రామకాంత్ ద్వారా ఆయనకు రాజు, మధుసూదన్లతో పరిచయం కాగా వీళ్లు హేమంత్ కుమార్ను పరిచయం చేశారు.
హేమంత్ టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేస్తాడని, అలాగే సమృద్ధి మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అద్దెకు కార్లు తీసుకుని ట్రావెల్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తాడని చెప్పారు. తాము ఇప్పటికే అతని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందుతున్నామని, మీరు కూడా పెడితే కనీసం ఐదు నుంచి పది శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. హేమంత్ కుమార్ కూడా స్వయంగా పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన లాభాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. వారి మాటలు నమ్మి రవీందర్ పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాడు.
గత ఏడాది ఆగస్టు 8న హేమంత్ కుమార్ స్వయంగా రవీందర్ ఇంటికి వెళ్లి ప్రామిసరీ నోటు రాసి, తన కారును ఉంచి రూ.12.5 లక్షలు తీసుకున్నాడు. ఆపై మరికొన్ని దఫాల్లో కలిపి రూ.3,29,48,620 తీసుకున్నారు. తనకు డబ్బు తిరిగి రాకపోవడంతో రవీందర్ ఈ విషయాన్ని రామకాంత్కు తెలిపారు. ఆయన హేమంత్ కుమార్ తనను రూ.43,86,584 మేర మోసం చేశారని, రాజు వద్ద రూ.20,18,000, మధుసూదన్ వద్ద రూ.15,00,000, అలాగే, సతీష్ వద్ద నుంచి రూ.41,98,537, శివ వద్ద నుంచి రూ.13,01,499 తీసుకుని, పెట్టుబడులపై లాభాలు ఇస్తానని చెప్పి వారినీ మోసం చేశాడని తెలిపాడు. దీంతో రవీందర్ సీసీఎస్లో ఫిర్యాదు చేయగా హేమంత్పై కేసు నమోదైంది.


