ర్యాపిడో రైడర్‌ను బెదిరించి రూ. 20 వేలు వసూలు | rapido rider cheated and extorted rs 20000 in hyderabad | Sakshi
Sakshi News home page

ర్యాపిడో రైడర్‌ను బెదిరించి రూ. 20 వేలు వసూలు

Jun 8 2026 7:34 AM | Updated on Jun 8 2026 7:34 AM

rapido rider cheated and extorted rs 20000 in hyderabad

హైదరాబాద్‌: ర్యాపిడో బైక్‌ రైడర్‌ను ప్రమాదం పేరుతో బురిడీ కొట్టించి, రూ. 20 వేలు వసూలు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జవహార్‌ నగర్‌కు చెందిన సురేష్‌ (29) మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తూ పార్ట్‌ టైమ్‌గా రాపిడో రైడర్‌గా జీవనం సాగిస్తున్నాడు.

జూన్‌ 4వ తేదీ రాత్రి భవాని నగర్‌ నుండి బోడుప్పల్‌కు ప్రయాణికుడిని తీసుకెళ్తుండగా, బంగారు మైసమ్మ వైన్‌ షాప్‌ సమీపంలో స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సురేష్‌ బైక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సురేష్‌ రోడ్డుపై పడిపోయాడు. అనంతరం ఆ ముగ్గురిలో ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోగా, మిగిలిన ఒక వ్యక్తి తన కాలు విరిగిందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సురేష్‌ ను కోరాడు. 

అతని మాటలు నమ్మిన సురేష్‌ తన బైక్‌పై అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా... మార్గమధ్యంలో ఆ వ్యక్తి తన సహచరులకు ఫోన్‌ చేశాడు. కొద్దిసేపటికే మిగతా ఇద్దరూ సురేష్‌ను అడ్డగించి, బలవంతంగా తమ వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బెదిరించి, ఆసుపత్రి ఖర్చుల పేరుతో డబ్బు డిమాండ్‌ చేశారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో సురేష్‌ తన స్నేహితుడు రాజశేఖర్‌కు ఫోన్‌ చేసి, నిందితులు చెప్పిన ’బద్దం శ్రీకాంత్‌’ అనే మొబైల్‌ నెంబర్‌కు ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేయించాడు. అనంతరం బాధితుడు  పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement