సాక్షి, హైదరాబాద్: నగరంలోని నకిలీ చాక్లెట్ల తయారీ కలకలం రేపింది. ప్రమాదకరమైన రసాయనాలతో చాక్లెట్లను తయారు చేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సీతారాంబాగ్లో నకిలీ, గడువు ముగిసిన చాక్లెట్ల తయారీ కేంద్రంపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ మెరుపు దాడులు నిర్వహించారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. భారీగా నిషేధిత, గడువు ముగిసిన చాక్లెట్ ఉత్పత్తులు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు కొండ కార్తీక్ నిబంధనలకు విరుద్ధంగా చాక్లెట్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాక్లెట్ ప్యాకెట్ల లేబుళ్లపై తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, గడువు ముగింపు తేదీ, 'బెస్ట్ బిఫోర్' వివరాలు ఏవీ లేకపోవడాన్ని అధికారులు నిర్థారించారు. మరింత లోతుగా పరిశీలించగా, చాక్లెట్ల తయారీలో గడువు ముగిసిపోయిన ఫ్లేవర్లు, ఎస్సెన్స్లు, వివిధ రకాల రంగు పొడులను నిల్వ ఉంచి వాడుతున్నట్లు గుర్తించారు.
అలాగే సదరు సంస్థకు కొత్త ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ ఉన్నప్పటికీ.. పాత లైసెన్స్ నంబర్ వివరాలతో ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తేలింది. వీటితో పాటు, అక్కడ పనిచేసే సిబ్బందికి ఎలాంటి వైద్య ధృవీకరణ పత్రాలు లేకపోవడం, పెస్ట్ కంట్రోల్ రికార్డులను నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.


