టూర్‌.. డర్‌! | pahalgam incident affected on Tourism | Sakshi
Sakshi News home page

టూర్‌.. డర్‌!

Apr 25 2025 7:16 AM | Updated on Apr 25 2025 7:16 AM

pahalgam incident affected on Tourism

సమ్మర్‌లో కశీ్మర్‌ వెళ్లేందుకు పర్యాటకుల ప్లాన్‌ 

 పహల్గాం ఉగ్రదాడితో భయాందోళన  

భారీగా రద్దయిన వేసవి ప్రయాణాలు 

గత రెండురోజుల్లో తారుమారైన పరిస్థితులు    

 ప్రత్యామ్నాయంగా సిమ్లా, కేరళ తదితర ప్రాంతాల ఎంపిక  

నగర పర్యాటక రంగంపై భారీ ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌: కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి పర్యాటక రంగంపై పిడుగుపాటుగా మారింది. నగర నుంచి కాశ్మీర్‌కు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. గత రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో బుకింగ్‌లు  రద్దయినట్లు నగరానికి చెందిన పలు ట్రావెల్స్‌ సంస్థలు వెల్లడించాయి. ఇటీవల పిల్లలకు వేసవి సెలవులు ప్రకటించడంతో  వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నగర వా సులు సన్నద్ధమవుతున్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఊటీ, మనాలి, కొడైకెనాల్, సిమ్లా తదితర ప్రాంతాలతో పాటు ఎక్కువ మంది కశ్మీర్‌ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అనూహ్యంగా పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి నేపథ్యంలో పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. 

మూడేళ్లుగా పెరిగిన టూర్లు.. 
కోవిడ్‌ అనంతరం పర్యాటకరంగం అనూహ్యంగా విస్తరించింది.   హైదరాబాద్‌ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. దక్షిణమధ్య రైల్వే ఆధ్యాత్మిక టూర్ల కోసం  ప్రత్యేకంగా భారత్‌గౌరవ్‌ రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరిగింది. సుమారు 70 నగరాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో గత మూడేళ్లుగా  టూరిస్టులు పెరిగారు. ఏటా లక్షలాది మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. జైపూర్, ఉదయ్‌పూర్‌ వంటి చారిత్రక నగరాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది.  

10 వేల మందికిపైగా..   
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యాటకుల రాకపోకలు విస్తరించాయి. ‘మే మొదటి వారంలోనే  హైదరాబాద్‌ నుంచి కశీŠమ్‌ర్‌కు వెళ్లేందుకు 5 గ్రూపులు బుక్‌ అయ్యాయి. ఇప్పుడు వాళ్లంతా తమ టూర్లను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులైంది’ అని హిమాయత్‌నగర్‌కు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ పవన్‌ విచారం వ్యక్తం చేశారు. కాశ్మీర్ ఉగ్ర ఘటన నేపథ్యంలో ఈ రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కశ్మీర్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న సుమారు 10 వేల మందికి పైగా పర్యాటకులు టూర్లను రద్దు చేసుకున్నట్లు ట్రావెల్స్‌ సంస్థలు అంచనా వేశాయి.

అమర్‌నాథ్‌ యాత్రపై ప్రభావం.. 
మరోవైపు జూలైలో జరగనున్న అమర్‌నాథ్‌యాత్రపైనా పహల్గాం దాడి ఘటన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం తమ వద్ద నమోదు చేసుకున్న 70 బుకింగ్‌లు నిలిచిపోయినట్లు అమీర్‌పేట్‌కు చెందిన ఓ సంస్థ ప్రతినిధి  పేర్కొన్నారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు ఆసక్తి చూపిన ఎంతోమంది ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగి జూలై వరకు సాధారణ పరిస్థితులు నెలకొంటే మార్పు రావచ్చు. కాశ్మీర్ పర్యటనలను రద్దు చేసుకున్న వాళ్లు చాలామంది సిమ్లా, ఉత్తరాఖండ్, ఊటీ, మనాలీ వంటి ప్రాంతాలను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement