
స్పాన్సర్షిప్స్ ద్వారా రూ.21 కోట్లు సమకూరాయి
మరో రూ.10 కోట్ల ఒప్పందాలు పెండింగ్లో ఉన్నాయి
అవి వస్తే నయాపైసా ఖర్చు కానట్టే...
రూ.200 కోట్ల ఖర్చంటూ ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణ
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు వెచ్చిస్తే..స్పాన్సర్షిప్ రూపంలో రూ.21 కోట్ల ఆదాయం సమకూరిందని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మరో రూ.10 కోట్లకు సంబంధించి స్పాన్సర్షిప్ ఒప్పందాలు పెండింగ్లో ఉన్నాయని, ఆ మొత్తం కూడా సమకూరితే ప్రభుత్వానికి నయాపైసా కూడా ఖర్చు లేకుండా ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలను నిర్వహించినట్టవుతుందని చెప్పారు. మిస్ వరల్డ్ సంస్థ అవసరాలకు రూ.3 కోట్లు ఇచ్చామని, అవి కూడా ఖర్చులో భాగంగానే చూపామని వెల్లడించారు. మంగళవా రం ఆయన సచివాలయంలో మరో మంత్రి పొన్నం ప్రభాక ర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఈ పోటీల రూపంలో ప్రపంచ మీడియాను తెలంగాణకు రప్పించటం ద్వారా ఇక్కడి పర్యాటక ప్రాంతాలపై ప్రపంచస్థాయిలో విస్తృత చర్చకు వీలు కల్పించామని, ఫలితంగా తెలంగాణ పర్యాట కానికి రూ.10 వేల కోట్ల విలువైన ప్రచారం లభించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో దీని ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. పర్యాటకం, హస్తకళ లు, చేనేత ఉత్పత్తులకు మంచి ప్రమోషన్ వచ్చిందని, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రపంచానికి పరిచయం చేశామని, ఆ వేడుకల నిర్వహణ, ఆతి థ్యం పట్ల పోటీదారులు, మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.
పరిస్థితి ఇలా ఉంటే, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు అయ్యాయంటూ కేటీఆర్, హరీశ్రావు తదితరులు ఆరోపిస్తున్నారని, అంత ఖర్చు ఎలా అయ్యిందో ఆధారాలు చూపాలని, తనను తెలంగాణభవ న్కు రమ్మన్నా, అబిడ్స్ చౌరస్తాకు రమ్మన్నా చర్చకు వస్తాన ని, నిరూపించలేకపోతే అంత ఖర్చు కాలేదని ఒప్పుకొని ముక్కు నేలకురాయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలకు రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశారని, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో తెలపాలని, ఇప్పుడు తాము ఇంత పెద్ద ఈవెంట్ను దాదాపు ఖర్చు లేకుండా నిర్వహించగలిగామని వెల్లడించారు.
చౌమొహల్లా ప్యాలెస్ డిన్నర్లో ఒక్కో ప్లేట్ భోజనం ఖరీదు రూ.లక్ష అని, సుందరీమణులకు 30 తులాలు చొప్పున బంగారం ఇచ్చారని తప్పుడు వార్తలు రాయించారన్నారు. చౌమొహల్లా ప్యాలెస్ డిన్నర్కు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించామని, ఒక్కో ప్లేట్ ఖర్చు రూ.8,200 మాత్రమే అయ్యిందని చెప్పారు. ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న ఘనత కేసీఆర్ దేనని అన్నారు. పోటీదారులకు పిసరు కూడా బంగారం ఇవ్వలేదని పేర్కొన్నారు. తనపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ మిస్ ఇంగ్లండ్ మిల్లామ్యాగీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమె ఆరోపణలే నిజమైతే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు సంతృప్తిగా, సంతోషంగా ఎలా ఉండగలిగారని ప్రశ్నించారు.
తాము మళ్లీ హైదరాబాద్కు వస్తామని, తమ జీవితంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంటుందని వారు చెప్పారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీలు విజయవంతం కావటంతో ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. వారి పార్టీల్లోని సమస్యలపై ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా రని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, పర్యాటకశాఖ డైరెక్టర్ హన్మంతు జండగే, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కె.లక్ష్మి పాల్గొన్నారు.