మూసీ నిర్వాసితుల కోసం టవర్లు | Meeting with bankers soon on builders issues says Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

మూసీ నిర్వాసితుల కోసం టవర్లు

Oct 27 2024 4:47 AM | Updated on Oct 27 2024 4:47 AM

Meeting with bankers soon on builders issues says Bhatti Vikramarka

సకల సౌకర్యాలతో నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వారికోసం ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం

నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకురూ.1,000 కోట్ల వడ్డీలేని రుణాలిస్తాం

మూసీ, ట్రిపుల్‌ ఆర్‌ ప్రాజెక్టులతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు

30 వేల ఎకరాల్లో అద్భుతంగా ఫ్యూచర్‌ సిటీ ఏర్పాటు

బిల్డర్ల సమస్యలపై త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని.. నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నిర్వాసితులు సకల సౌకర్యా లతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి ప్రసంగించారు. మూసీ నిర్వాసితుల పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

నిర్వాసితులైన డ్వాక్రా మహిళల కు రూ.1,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని.. చిన్నతరహా పరిశ్రమలు ఏర్పా టు చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పరీవాహక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కోసం 39 ఎస్టీపీలు మంజూరు చేశామని భట్టి చెప్పారు. 

రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు బ్యాంకర్లతో ఉన్న సమస్యలపై త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇస్తామని వివరించారు. గత ప్రభుత్వం తరహాలో అనుకూలంగా ఉన్న వాళ్లను దగ్గరికి తీసుకోవడం, లేని వాళ్లను దూరం పెట్టడం వంటి ఆలోచన తమకు లేదన్నారు.

అద్భుతంగా ఫ్యూచర్‌ సిటీ..: హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిపై కొన్ని నెలలుగా కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవం, రీజినల్‌ రింగ్‌ రోడ్డుతోపాటు 30 వేల ఎకరాల్లో అద్భుతంగా నిర్మించనున్న ఫ్యూచర్‌ సిటీతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. 

ఎయిర్‌పోర్ట్‌ నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్‌ సిటీకి చేరుకోవచ్చని.. అక్కడ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ, క్రికెట్‌ స్టేడియం వంటివెన్నో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా అభివృద్ధి చేయాలన్న చిత్తశు ద్ధి, సంకల్పంతో ఉందన్నారు. 

నాటి పాలకులు బీహెచ్‌ఈఎల్, సీసీఎంబీ, హెచ్‌ఈ ఎల్‌ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని.. ఫలితంగా వారి నివాసం కోసం కూకట్‌పల్లి, వెంగళరావునగర్, బర్కత్‌పుర వంటి హౌసింగ్‌ బోర్డులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రూ. పది వేల కోట్లు కేటాయించామన్నారు. ఆ నిధులతో ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు, డ్రైనేజీలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రపంచ డెవలపర్లను ఆకర్షిస్తామని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement