హైదరాబాద్: స్నేహం పేరుతో ఒక మహిళను నమ్మించి రూ.లక్షల్లో మోసగించడమే కాకుండా తన కోరిక తీర్చాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. వెంకటగిరిలో నివసించే మహిళ (30)కు పాలపారి కుంభేదర్రెడ్డి (32) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారానికి తనకు డబ్బులు కావాలంటూ కటారియా జ్యువెలర్స్లో ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టించి రూ.2 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె కళ్లు గప్పి ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్టు రశీదును దొంగిలించాడు.
తన అప్పులను తీర్చుకుని ఆ బంగారాన్ని విడిపించుకుని మళ్లీ గురు గోల్డ్షాపులో రూ.3.50 లక్షలకు తిరిగి తాకట్టు పెట్టాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు నిలదీయగా ఆమెను తీవ్రంగా వేధించసాగాడు. తన కోరిక తీరిస్తేనే డబ్బులు ఇస్తానంటూ అసభ్యంగా మాట్లాడడమే కాకుండా చంపేస్తానని హెచ్చరించాడు. పరువు పోతుందనే భయంతో బాధితురాలు చివరకు రూ.3.50 లక్షలు చెల్లించి ఆ బంగారం విడిపించుకుంది. అనంతరం అప్పుల భారం, నిందితుడి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


