కరీంనగర్‌లో నడిరోడ్డుపై లారీ దగ్ధం

Lorry Burnt On Main Road In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ :  జిల్లాలో నడిరోడ్డుపై మంగళవారం లారీ దగ్ధమయింది. లారీతో పాటు లారీలో ఉన్న కాంక్రిట్ మిక్సర్ మిషన్ కాలిబూడిదయ్యింది. మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి-లింగాపూర్ గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ను సప్లై చేసే లారీలో కరీంనగర్ నుంచి లింగాపూర్‌కు కాంక్రీట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా పైన కరెంటు వైర్లు తాకి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ బండిని ఆపి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మిక్సర్ కాలి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లో పడింది. లారీ క్యాబిన్‌తోపాటు టైర్లు కాలిపోయాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మిక్సర్ కాలి బూడిద అయింది. లారీ పాక్షికంగా దెబ్బతింది. నడిరోడ్డుపై అగ్ని ప్రమాదం జరగడంతో ఆ దారిలో వెళ్లే వారు భయాందోళనకు గురయ్యారు. అయితే లింగాపూర్‌లో చెక్ డ్యామ్ నిర్మాణానికి కాంట్రాక్టర్ లారీలో కాంక్రిట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. నష్టం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు.

చదవండి: 

సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య?

‘ఆ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతున్నాయి’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top