ప్రయాణికులకు శుభవార్త, రైలు కూతకు గజ్వేల్‌ సిద్ధం | Local Train Service Between Hyderabad And Gajwel Soon | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు శుభవార్త, రైలు కూతకు గజ్వేల్‌ సిద్ధం

Dec 18 2021 2:55 AM | Updated on Dec 18 2021 2:55 AM

Local Train Service Between Hyderabad And Gajwel Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్, హైదరాబాద్‌ ప్రధాన రైల్వే స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌ ఎదగబోతోంది. నగరంలోని స్టేషన్లలో రద్దీ పెరిగి విస్తరణకు అవకాశం లేకపోవడంతో సిటీకి దగ్గరగా ఉన్న (60 కి.మీ.) గజ్వేల్‌ స్టేషన్‌పై రైల్వే అధికారులు దృష్టి పడింది. ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపాలని అధికారులు భావిస్తున్నారు. కుదిరితే కొన్నింటిని జనవరి నుంచే ప్రారంభించాలని అనుకుంటున్నారు. గజ్వేల్‌ నుంచి త్వరలో కాచిగూడకు డెమూ సర్వీసునూ నడపాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో కీలక రైల్వేస్టేషన్‌గా గజ్వేల్‌ మారే అవకాశముంది.   

విస్తరణకు వీలు లేక..
సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ల విస్తరణకు స్థలం లేక ఇబ్బందిగా మారింది. ప్రస్తుత రైళ్ల తాకిడిని అవి తట్టుకోలేకపోతున్నాయి. కొత్త రైళ్లను ప్రారంభించడం అసాధ్యంగా మారింది. ఒక స్టేషన్‌ నుంచి రైలు మొదలవ్వాలంటే ముందు దానికి మెయింటెనెన్స్‌ పనులు జరపాలి. దూరప్రాంతా లకు వెళ్లే రైళ్లకు ఈ పనులు మరింత కఠినంగా ఉంటాయి. రైళ్ల అవసరాల ప్రకారం 3 రకాల మెయింటెనెన్స్‌ పనులుంటాయి. ఇంజిన్, బ్రేకులు, లింకులు, ఏసీ.. ఇలా అన్నింటిని పరిశీలించే ప్రైమ రీ మెయింటెనెన్స్‌కు 6 గంటలు పడుతుంది. బ్రేకులు, గేర్లు.. తదితరాలను పరిశీలించి సెకండరీ మెయింటెనెన్స్‌కు 4 గంటలవుతుంది. ఈ రెండు రకాల పనులకు పిట్‌ లైన్లు అవసరమవుతాయి. ఈ లైన్లలో పట్టాల మధ్య మనిషి నిలబడేంత గుంత ఉంటుంది. అందులో నిలబడి మరమ్మతులు చేస్తారు. ఇలాంటి పిట్‌లైన్లు సికింద్రాబాద్‌లో 7 ప్లాట్‌ఫామ్స్‌పైనే ఉన్నాయి. నాంపల్లి స్టేషన్‌లో మూడే ఉన్నాయి. రైళ్ల మెయింటెనెన్స్‌ ఎక్కువ సమయం పడుతుండటం, కొత్త లైన్లు నిర్మించే స్థలం లేకపోవడంతో వేరే రైళ్లను ప్రారంభించే వీలు లేకుండా పోతోంది. కాచిగూడను విస్తరించే పరిస్థితి లేక  లింగంపల్లి స్టేషన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ పిట్‌ లైన్స్‌ లేక సాధారణమెయింటెనెన్స్‌ మాత్రమే చేస్తున్నారు. 24 బోగీలుండే పెద్ద రైళ్లకు సరిపడా ప్లాట్‌ఫామ్స్‌ సికింద్రాబాద్‌లో 7, నాంపల్లిలో మూడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి దగ్గరగా ఉన్న గజ్వేల్‌పై రైల్వే దృష్టి పడింది.

స్టేషన్‌ రెడీ
మనోహరాబాద్‌–కొత్తపల్లి కొత్త రైల్వే మార్గంలో ఉన్న గజ్వేల్‌ స్టేషన్‌ ఇప్పటికే సిద్ధమైంది. రైళ్లు నడుపుకునేందుకు రైల్వే బోర్డు కూడా అనుమతిచ్చింది. ఇక్కడి నుంచి ప్యాసింజర్‌ రైలును నడపాలని అనుకున్నా కరోనా ఆంక్షల వల్ల మొదలు కాలేదు. గజ్వేల్‌ నుంచి నగరానికి డెమూ (డీజిల్, ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) రైలు సేవలను రోజుకు రెండు ట్రిప్పులు నడిపించాలని అనుకున్నా అది కూడా కరోనా వల్ల ఆగిపోయింది. రైల్వే బోర్డు సిగ్నల్‌ ఇవ్వగానే గజ్వేల్‌కు డెమూ రైలు ప్రారంభమవుతుంది.  

 గజ్వేలే ఎందుకు? 
హైదరాబాద్‌కు గజ్వేల్‌ స్టేషన్‌ చేరువగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభిస్తే దగ్గర్లోని ప్రాంతాల ప్రయాణికులు ఇక్కడికే వచ్చి ఎక్కుతారు. ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌ వైపో, కాచిగూడ వైపో వెళ్లే సిటీ ప్రయాణికులూ ఎక్కుతారు. ఆయా స్టేషన్లలో సాధారణ స్టేషన్‌ తరహాలోరైలు కాసేపు ఆగి బయలుదేరితే సరిపోతుంది. దీంతో రెండు ప్రధాన స్టేషన్లపై మెయింటెనెన్స్‌ బాధ ఉండదు. ప్రయాణికుల తాకిడి తగ్గి భారం కూడా బాగా తగ్గిపోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement