ప్రధాని ఫోన్‌ చేసి త్రిపుర వెలుపల పనిచేయాలన్నారు | Jishnu Dev Varma Appointed As Telangana New Governor | Sakshi
Sakshi News home page

ప్రధాని ఫోన్‌ చేసి త్రిపుర వెలుపల పనిచేయాలన్నారు

Jul 30 2024 12:31 AM | Updated on Jul 30 2024 12:31 AM

Jishnu Dev Varma Appointed As Telangana New Governor

రేవంత్‌ ఫోన్‌ చేసి.. తెలంగాణకు స్వాగతం అని అన్నారు..  

తెలంగాణ గవర్నర్‌గా తన నియామకంపై జిష్ణు దేవ్‌ వర్మ 

మోదీ, సీఎం రేవంత్‌ ఫోన్‌ చేసే దాకా తనకు ఆ విషయం తెలియదని వ్యాఖ్య 

సీఎం రేవంత్‌తో సమన్వయం చేసుకొని పనిచేస్తానని ప్రకటన

అగర్తల: తెలంగాణ నూతన గవర్నర్‌గా తనను నియమించినట్లు ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేసి చెప్పే దాకా తెలియదని బీజేపీ నేత, త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ తెలిపారు. ‘ప్రధాని మోదీ శనివారం రాత్రి నాకు ఫోన్‌ చేశారు. త్రిపుర వెలుపల పనిచేయాల్సి ఉంటుందన్నారు. నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రధానికి చెప్పా. ఆ కాసేపటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేసి తెలంగాణకు స్వాగతం అన్నారు. దీంతో నేను తెలంగాణ నూతన గవర్నర్‌గా ఆ రాష్ట్రానికి వెళ్లనున్నట్లు అప్పుడు అర్థమైంది’అని జిష్ణు దేవ్‌ వర్మ త్రిపురలో విలేకరులకు తెలిపారు.

త్రిపుర నుంచి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తి తానేనని చెప్పారు. తమ రాష్ట్రంపై ప్రధాని మోదీకి ఉన్న ఆపేక్షకు తన నియామకమే నిదర్శనమని పేర్కొన్నారు. ‘గతంలో డిప్యూటీ సీఎంగా రాజకీయ పదవీ బాధ్యతలు నిర్వర్తించా. ఇప్పుడు నాకు అప్పగించిన రాజ్యాంగ బాధ్యతలను నెరవేరుస్తా. ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకొని పనిచేస్తా. బుధవారం తెలంగాణకు చేరుకొని అదే రోజు గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేస్తా’అని జిష్ణు దేవ్‌ వర్మ వివరించారు. 2018 నుంచి 2023 దాకా త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేసిన జిష్ణు దేవ్‌ వర్మ.. గతేడాది జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సెఫాహిజాలా జిల్లాలోని చారిలామ్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన త్రిపుర మాజీ రాజవంశీకుల కుటుంబానికి చెందిన వారు.

Advertisement
 
Advertisement
Advertisement