కోరుట్ల చిన్నారి కేసులో బిగ్‌ ట్విస్ట్‌... సొంత పిన్నే..! | Jagtial District: Twist In The Korutla Child Case | Sakshi
Sakshi News home page

కోరుట్ల చిన్నారి కేసులో బిగ్‌ ట్విస్ట్‌... సొంత పిన్నే..!

Jul 6 2025 1:17 PM | Updated on Jul 6 2025 2:02 PM

Jagtial District: Twist In The Korutla Child Case

సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణం ఆదర్శనగర్ చిన్నారి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పాప సొంత పిన్నే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న(శనివారం) సాయంత్రం సమయంలో హితీక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యమవగా.. పాప తల్లీ నవీన పోలీస్ ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటిపక్కనే బాత్రూమ్‌లో విగతజీవిగా పాప మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు.

పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన పాప తండ్రి రాములు.. హుటాహుటీన అక్కడా నుంచి బయలుదేరారు. పాప సొంత పిన్ని మమతనే హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. హితీక్ష కుటుంబసభ్యుల్లో  కొందరిని ప్రశ్నించిన పోలీసులు.. ​కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లుగా అనుమానిస్తున్నారు. సిసీ టీవీ, సెల్‌ఫోన్‌ లోకేషన్‌ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 40 మందిని పోలీసులు విచారించారు.

శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది.

సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్‌రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్‌రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్‌గా పోలీసులు గుర్తించారు. విజయ్‌ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్‌తో పాటు అతని అన్నదమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్‌ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్‌ఫోన్‌ ద్వారా అతనితో మాట్లాడితే  వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం.

విజయ్‌ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్‌రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్‌రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement