హైదరాబాద్: భార్య పుట్టినరోజు నాడే ఓ ఐటీ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్ (40), రాధిక దంపతులు కూకట్పల్లి దేవి నగర్లోని భాస్కర ప్యాలెస్లో నివాసముంటున్నారు. రమేష్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 1న భార్య రాధిక పుట్టినరోజు కావడంతో ఆమె అక్క, తమ్ముడు ఇంటికి వచ్చారు.
అందరూ కలిసి ట్యాంక్ బండ్కు వెళదామని రమేష్ను కోరగా.. తాను రానని చెప్పడంతో వారు వెళ్లారు. ఇంట్లో ఉన్న రమేష్ అర్ధరాత్రి భార్యకు ‘పొరపాటు జరిగింది సారీ గుడ్ బై’ అని మెసేజ్ పంపాడు. కంగారుపడిన భార్య వెంటనే ఇంటికి వచ్చి చూడగా, అప్పటికే రమేష్ చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని విగతజీవుడిగా పడి ఉన్నాడు. భార్య పుట్టినరోజే భర్త ఇలా ప్రాణం తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


