వైరస్‌ల దాడి కరోనాతో ఆగదా.. ఇంకా వస్తాయా?

IPBSE Study About Viruses And Its Effects On Humans - Sakshi

కరోనా మహమ్మారి దాడి మొదలై ఏడాదిన్నర దాటింది. ఇప్పటికీ చాలా దేశాలను వణికిస్తూనే ఉంది. మరి దీనికి అంతమెప్పుడు? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు మనుషులపై ఇలాంటి మహమ్మారుల దాడి ఇదే మొదటిదీ కాదు.. ఇదే చివరిది అయ్యే అవకాశమూ లేదు. తరచూ ఏదో ఓ కొత్త వైరస్‌ దాడి మొదలవుతూనే ఉంటుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? కారణాలు ఏమిటి? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న సందేహాలు వస్తున్నాయి కదా. దీనిపై ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్లాట్‌ఫాం ఆన్‌ బయోడైవర్సిటీ అండ్‌ ఎకోసిస్టమ్‌ సర్వీస్‌ (ఐపీబీఈఎస్‌)’ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందామా.. 

జంతువులు, పక్షుల నుంచే.. 
మనుషులకు కొత్తగా సంక్రమిస్తున్న వ్యాధుల్లో చాలా వరకు జంతువులు, పక్షుల నుంచి వ్యాపిస్తున్నవే. అంటే ప్రాథమికంగా జంతువులు, పక్షుల్లోనే ఉండి, వాటిపైనే ప్రభావం చూపే సూక్ష్మజీవులు.. మ్యుటేషన్‌ చెంది మనుషులపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులను జూనోటిక్‌ లేదా జూనోసెస్‌ అని పిలుస్తారు. 
1940 దశాబ్దం నుంచి ఇప్పటివరకు కొత్తగా 330 అంటువ్యాధులను గుర్తించగా.. అందులో 60 శాతానికిపైగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించినవే. 

ఏటా మరిన్ని కొత్త వ్యాధులు 
జంతువులు, పక్షుల నుంచి మనుషులకు విస్తరిస్తున్న కొత్త వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతూపోతోంది. సగటున 3, 4 వ్యాధులు ప్రభావం చూపుతున్నాయి. వీటిల్లో కొన్నిరకాల వైరస్‌లు సామర్థ్యం పెంచుకుని మహమ్మారులుగా మారుతున్నాయి. 

మహమ్మారులుగా మారేవి అవే.. 
ఇన్‌ఫ్లుయెంజా, సార్స్, ఇప్పటి కోవిడ్‌ సహా మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికించిన, వణికిస్తున్న వ్యాధులు మొత్తం కూడా జంతువులు, పక్షుల నుంచి వచ్చినవే. 
ఎబోలా, జికా, నిఫా వంటి ప్రమాదకర వ్యాధులను కలిగించే వైరస్‌లలో 70 శాతానికిపైగా అడవి జంతువుల నుంచో, పెంపుడు జంతువుల నుంచో మనుషులకు విస్తరించినవే. 

1. మంకీపాక్స్‌                  
    ఎబోలా 
    లైమ్‌ డిసీజ్‌ 
    సార్స్‌ 
    హంటా వైరస్‌

2. ఆంథ్రాక్స్‌ 
    వెస్ట్‌ నైల్‌ వైరస్‌ 
    ప్లేగ్‌ 
    ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా 
   రేబిస్‌ 
   బ్రూసెల్లోసిస్‌ 
   ట్యూబర్‌క్యులోసిస్‌ 
   సాల్మనెల్లోసిస్‌ 
   ట్యులరెమియా 

3. కౌపాక్స్‌ 
   బొవైన్‌ స్పాంజిఫామ్‌ 
   ఎన్‌సెఫలోపతి 
   రిఫ్ట్‌వ్యాలీ ఫీవర్‌ 
   ఈ కొలి 

ఇంకా గుర్తించని వైరస్‌లు లక్షల్లోనే.. 
జంతువులు, పక్షుల్లో ఉండే వైరస్‌లలో మనం ఇంకా గుర్తించని వాటి సంఖ్య 17 లక్షలకుపైనే అని ఒక అంచనా. అందులో 6.3 లక్షల నుంచి 8.2 లక్షల వైరస్‌లకు మనుషులకు సోకే సామర్థ్యం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
ఊ నిజానికి భూమ్మీద కొన్నికోట్ల రకాల వైరస్‌లు ఉన్నాయని.. వాటిలో మనం గుర్తించినవి, గుర్తించగలిగినవి చాలా తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. 

ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడం వల్లే.. 
వైరస్‌లు ఇప్పుడిప్పుడు కొత్తగా పుడుతున్నవేమీ కాదు. కొన్ని లక్షల ఏళ్లుగా జంతువులు, పక్షుల్లో ఉన్నవే. పరిస్థితులకు అనుగుణంగా రూపుమార్చుకుంటున్నవే. మరి ఇప్పుడు కొత్తగా ప్రభావం చూపించడం ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ప్రకృతి సమతౌల్యాన్ని మనుషులు దెబ్బతీయడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అడవులను నరికివేయడం వల్ల వస్తున్న వాతావరణ మార్పులు, వన్యప్రాణులు జనావాసాలకు దగ్గర కావడం, వాటి మాంసం వినియోగం వంటివి ప్రమాదకరంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. 

►దాదాపు వందేళ్ల కిందటితో పోలిస్తే.. ప్రస్తుతం 30 శాతం అడవులు తగ్గిపోయాయి. ఆ భూమిలో వ్యవసాయం, పట్టణీకరణ పెరిగింది. 
►2050 నాటికి 247 కోట్ల ఎకరాల అడవులు అంతరిస్తాయని ఒక అంచనా. 
►ప్రపంచవ్యాప్తం గా అడవి జంతువుల్లో 24 శాతం వరకు స్మగ్లింగ్‌ బారినపడుతున్నాయి. దీని విలువ సగటున ఏటా 17 వేల కోట్ల రూపాయలకుపైనే అని అంచనా. 

ఊహించ లేనంత నష్టం 
ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీస్తూ మనుషులు సంపాదిస్తున్న దానికంటే కోల్పోతున్నదే ఎక్కువని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వివిధ రూపాల్లో జరుగుతున్న నష్టం ఊహించలేమని పేర్కొంటున్నారు. 
►వివిధ మహమ్మారుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆర్థికంగా జరుగుతున్న నష్టం ఏడున్నర లక్షలకు కోట్ల మేర ఉంటుందని అంచనా. 
►అదే కరోనా కారణంగా తొలి ఏడాదిలో జరిగిన నష్టం ఏకంగా 60 లక్షల కోట్ల నుంచి కోటి కోట్లదాకా ఉంటుందని చెబుతున్నారు. 

మరి ఇప్పుడేం చేయాలి? 
ప్రకృతితో కలిసి జీవించడమే మనిషి ఇప్పుడు చేయాల్సిన పని అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొత్తగా మహమ్మారులు వచ్చాక వాటిని నియంత్రించేందుకు కష్టపడటం కంటే.. అసలు అలాంటి భయంకర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త పడటమే మేలు అని స్పష్టం చేస్తున్నారు. అడవులను నరికివేయడం ఆపాలని, వీలైతే కొత్తగా అడవులు పెంచాలని.. వన్యప్రాణుల వేట, వ్యాపారాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు. 
►జంతువులు, పక్షుల నుంచి వైరస్‌లు మనుషులకు వ్యాపించే అవకాశాలను ముందుగానే గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని.. ఒకవేళ సోకినా వెంటనే గుర్తించి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top