పాడైన కాలేయానికి.. పునరుజ్జీవం | Hyderabad Startup Achieves Global First in Liver Failure Treatment | Sakshi
Sakshi News home page

పాడైన కాలేయానికి.. పునరుజ్జీవం

Jul 25 2025 4:50 AM | Updated on Jul 25 2025 4:50 AM

Hyderabad Startup Achieves Global First in Liver Failure Treatment

హెచ్‌సీయూలోని తులసీ థెరప్యూటిక్స్‌ స్టార్టప్‌ ఘనత

మార్పిడి అవసరం లేకుండా మళ్లీ పెరిగేలా ప్రయోగం 

జంతువుల్లో ప్రీక్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం.. త్వరలో మానవ ప్రయోగాలు 

దేశంలో 25 లక్షల మందిని పరీక్షించగా 65 శాతం మంది ఫ్యాటీ లివర్‌ బాధితులే..  

సాక్షి, హైదరాబాద్‌: ఫ్యాటీ లివర్, లివర్‌ ఫెయి­ల్యూర్‌ వంటివాటి గురించి తరచూ వింటూంటాం. జీవన­శైలి మార్పు వంటి కారణాలతో మన కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. రక్తశుద్ధి, ప్రొటీన్, హార్మో­న్ల ఉత్పత్తి, జీవక్రియల నియంత్రణ, రోగని­రోధక వ్యవస్థకు ఊతమివ్వడంలో కాలేయం కీలకం. అయి­తే, కాలేయ సమస్యలకు పరిష్కారం కనుక్కో­వడంలో ఓ స్టార్టప్‌ కంపెనీ ముందడుగు వేసింది. మూల­కణాలు, ఎక్సోసోమ్‌­లను ఉప­యో­గించి పాడై­పోయిన జంతు కాలే­యాన్ని మళ్లీ పెరిగేలా చేయడంలో ‘తులసీ థెర­ప్యూ­టిక్స్‌’ అనే సంస్థ విజయం సాధించింది. ప్రస్తుతం కాలేయం బాగా పాడైతే ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్ప మరో మార్గం లేదు. ఈ సంస్థ చేస్తున్న ప్రయోగాలు పూర్తిస్థాయిలో విజ­యవంతమైతే అలాంటి సమస్య ఉత్పన్నం కాదు. పాడైన కాలేయాన్ని మార్చకుండా పునరుజ్జీవింపచేయొచ్చు

ప్రీక్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం
హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ఆస్పైర్‌–­బయో నెస్ట్‌ అనే విభాగం ఉంది. కాలేయం పనిచే­యని స్థితిలో ఉంటే బాగుచేయడం ఎలా అన్న దానిపై తులసీ థెరప్యూటిక్స్‌ ఏళ్లుగా పరిశోధనలు చేస్తోంది. ఇందులోభాగంగా కంపెనీ శాస్త్రవేత్తలు ‘తులసీ–28ఎక్స్‌’ అనే ఒక మందును తయారు చేశా­రు. ఇందులో బొడ్డుతాడు జిగురులో ఉండే మూలకణాలతో తయారైంది. దీన్ని మెసెన్‌కైమల్‌ స్టెమ్‌సెల్స్‌ అంటారు. వీటికి బొడ్డుతాడులోనే లభించే ఎక్సోసోమ్‌లు (శరీర కణాల మధ్య మెసెంజర్‌లాంటివి) కూడా చేర్చి ప్రయోగాలు చేపట్టారు.

అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ చలసాని నాగ, చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌ డాక్టర్‌ అజయ్‌ దుసేజాల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రయోగం విజయం సాధించింది. తులసీ–28ఎక్స్‌ అందుకున్న జంతు కాలేయాలన్నీ మళ్లీ పెరగడం మొదలైంది. ఏ ఒక్క జంతువూ మరణించలేదు. ఇదే సమయంలో తులసీ–28ఎక్స్‌ అందుకోని జంతువుల కాలేయాల్లో 14 శాతం పెరుగుదల కనిపించిందని, 43 శాతం జంతువులు మరణించాయని తులసీ థెరప్యూటిక్స్‌ వ్యవస్థాపకులు, సీఈవో డాక్టర్‌ అట్లూరి సాయిరామ్‌ తెలిపారు.

భారతీయ బయో­టెక్‌ రంగంలో ఇదో మైలు రాయి లాంటిదని వ్యాఖ్యా­నించారు. జంతు కాలేయాల్లో ప్రీక్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైన నేపథ్యంలో మానవ ప్రయోగాలు సవాలుగా ఉన్నాయన్నారు. ఈ పరిశో­ధన కాలేయ సంబంధిత వ్యాధుల చికిత్సలో కొత్త అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. పరిశోధన వివరాలు జర్నల్‌ ఆఫ్‌ రీజనరేటివ్‌ మెడిసిన్‌లో ప్రచురణకు అర్హత సాధించడం విశేషం.  

25 లక్షల మందికి పరీక్షలు
దేశంలో ఏటా లక్షల మంది కాలేయ వ్యాధుల బారి­న పడుతున్నారు. ఈ సంస్థ దేశంలో 25 లక్షల మందికి పరీక్షలు జరపగా 65% మందికి వ్యాధి ఉన్నట్టు తేలింది. వీరిలో 85%మంది మంది మద్య­పా­నానికి బానిసలైన వారు. దేశంలో ప్రతి 8 మంది­లో ఒకరు ఊబకాయంతో ఉన్నారు. ఊబకా­యులు నాన్‌ ఆల్క­హాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువ. ఐటీ రంగంలో పనిచే­స్తున్న వారిలో అత్యధి­కులు కాలేయ వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.  

‘నిమ్స్‌’తో కలిసి మానవ ప్రయోగాలు
మూలకణాలకు ఎక్సోసోమ్‌లను జోడించి కాలేయ వ్యాధికి ఉపయోగించింది తులసీ థెరప్యూటిక్స్‌ సంస్థ ఒక్కటే. మాకు తెలిసినంత వరకూ ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేసిన బయోటెక్‌ కంపెనీ ఇంకోటి లేదు. ‘నిమ్స్‌’ సాయంతో తులసీ–­28­ఎక్స్‌తో మానవ ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం కాలేయం బాగా పాడైతే మార్చడం మినహా మరో మార్గం లేదు. మా ప్రయోగాలు విజయ­వంతమైతే ఈ సమస్య రాదు.     –డాక్టర్‌ బొంతల రవి, తులసీ థెరప్యూటిక్స్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement