ట్యాబ్లెట్లు నింపేస్తునారు! | Hyderabad People Buy Vitamin Tablets For Boosting Immunity | Sakshi
Sakshi News home page

ట్యాబ్లెట్లు నింపేస్తునారు!

Aug 4 2020 9:31 AM | Updated on Aug 4 2020 4:23 PM

Hyderabad People Buy Vitamin Tablets For Boosting Immunity - Sakshi

కోఠిలోని ఇందర్‌బాగ్‌లో ఓ మెడికల్‌ షాప్‌ వద్ద రద్దీ

సాక్షి, సిటీబ్యూరో: కరోనా ఎఫెక్ట్‌తో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎన్నెన్నో దారులు వెదుకుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)పెంచుకునేందుకు కషాయం తాగడం లాంటి వంటింటివైద్యానికి ప్రాముఖ్యతనిస్తూనే..విటమిన్స్, మినరల్స్‌ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఏ మెడికల్‌ షాపులకు భారీగా గిరాకీ పెరిగింది. కొందరు వ్యక్తిగతంగా టాబ్లెట్లు కొనుగోలు చేస్తుంటే..మరికొందరు డాక్టర్ల సలహాతో మందులువాడుతున్నారు. గత వారం రోజులుగా పలు విటమిన్స్, మినరల్స్‌కుసంబంధించిన మందుల కొరత ఏర్పడింది. మెడికల్‌ షాపుల్లోనో స్టాక్‌ అని చెప్పేస్తున్నారు.

దీన్నిబట్టి నగర జనంఏ స్థాయిలో ఈ ముందులు వాడుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది. సోమవారం ‘సాక్షి’ నగరంలోని పలు మెడికల్‌ షాపులనుసందర్శించగా..పలుఆసక్తికర విషయాలు తెలిశాయి. మెడికల్‌ షాప్‌లకు వచ్చే సుమారు వంద మంది కస్టమర్స్‌లో దాదాపు 90 మంది విటమిన్‌ సి,డితో పాటు ఇతర మినరల్‌ మాత్రలను కొనుగోలు చేయడం కన్పించింది. కొందరైతే ఇంట్లోని కుటుంబ సభ్యుల అందరి కోసం మాత్రలు కొనేశారు. వీటితో పాటు రోగ నిరోధక శక్తినిచ్చే ఇతర ఇమ్యూనిటీ బూస్టింగ్‌ పౌడర్లు, టానిక్స్, జింక్, ఐరన్, మల్టీవిటమిన్స్‌ కొనుగోలు చేస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నా లేకున్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శరీరంలో అన్ని విధాలుగా శక్తి సమకూర్చడానికి ఈ రకమైనా మందులు కొంటున్నామని చెబుతున్నారు. ఇలా నగరవాసులు శరీంలో విటమిన్స్‌ను నింపేస్తున్నారు. 

ఆక్సీమీటర్లు, నెబులైజర్లకు పెరిగిన డిమాండ్‌ 
కరోనా వ్యాధి లక్షణాలుంటే శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గతుందని నగర ప్రజల్లో ప్రచారం ఎక్కువగా ఉంది. శరీరంలో ఆక్సిజన్‌ శాతం తెలుసుకోవడానికి ఆక్సీమీటర్‌ ఉపయోగపడుతుంది. దీంతో చాలా మంది ఆక్సీమీటర్లు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో వీటికి డిమాండ్‌ పెరగడంతో కొరత ఏర్పడింది. కరోనా వ్యాధి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ ఆక్సీమీటర్లు కొనుగోలు చేస్తున్నారు. జలుబు, జ్వరం ఉండి డాక్టర్ల వద్దకు వెళ్తే ముందు ఆక్సీమీటర్‌ పెట్టి చూస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ఆక్సీమీటర్లు,  థర్మామీటర్లు, స్క్రీనింగ్‌ మిషన్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక ప్రజల అవసరాలను మెడికల్‌ షాపుల నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. డిమాండ్‌ పెరగడంతో ట్యాబెట్లు, ఇతర వస్తువుల ధరలు అమాంతం పెంచేశారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని అడిగితే స్టాక్‌ లేదని సమాధానం చెబుతున్నారు. గతంలో కోఠిలోని ఇందర్‌బాగ్‌ హోల్‌సేల్‌ మెడికల్‌ షాపుల సముదాయంలో మందులపై ఎక్కువగా డిస్కౌంట్‌ ఉండేది. కరోనా కారణంగా ఇప్పుడు ఎలాంటి డిస్కౌంట్‌ లభించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు.  

వాటికే డిమాండ్‌ ఉంది.. 
ప్రస్తుతం కరోనా వ్యాధి నుంచి రక్షణ కోసం, రోగనిరోధ శక్తి పెంచడానికి జనం వివిధ రకాల విటమిన్స్, కాల్షియం, మినరల్స్‌ మందులు ఎక్కువగా వాడుతున్నారు. డాక్టర్లు కూడా ప్రతి రోగికి ఇలాంటి మందులే రాస్తున్నారు. ప్రత్యేకంగా విటమిన్‌–సి, డి, కాల్షియం మందులకు బాగా డిమాండ్‌ ఉంది. అలాగే ఈజీ బ్రీత్‌ మిషన్లతో ఆవిరి పడుతున్నారు. – గోపీనాథ్, మెడ్‌ప్లస్‌ ఉద్యోగి, ఆనంద్‌నగర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement