
లోపభూయిష్ట విచారణ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు ప్రమాదం
అసమగ్ర దర్యాప్తు పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
అత్యాచారం కేసులో కల్నల్ రిషిశర్మ జీవిత ఖైదు రద్దు
నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కేసుల దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అనుసరిస్తున్న తీరు లోపభూయిష్టంగా ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది మొత్తం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. దర్యాప్తు బృందం న్యాయంగా విచారణ చేయకపో తే అది పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగానే పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏళ్లకేళ్లు విచారణతో న్యాయం అందించడంలో జాప్యం జరుగుతుందని చెప్పింది.
ఇది న్యాయ వ్యవస్థపై పౌరుల విశ్వాసాన్ని ప్రభా వితం చేస్తుందని పేర్కొంది. అత్యాచారం కేసులో హైదరా బాద్లోని శామీర్పేట్ డీఆర్డీవో ఏఓ కల్నల్ రిషిశర్మకు ఫాస్ట్ట్రాక్ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసి, ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. తన తల్లికి సన్నిహి తుడైన రిషిశర్మ తనపై అత్యాచారం చేయటంతో తాను గర్భం దాల్చానన్న బాధితురాలి ఫిర్యాదుతో 2017లో ఆయ నపై కేసు నమోదైంది.
విచారణ చేపట్టిన ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు 2024లో రిషిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. బాధితురాలు గర్భవతి అని తెలిసిన మూడు నెలల తర్వాత ఈ కేసు నమోదైంది. ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కల్నల్ శర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటి షన్పై జస్టిస్ పి.సామ్కోషి, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మా సనం విచారణ చేపట్టి, రిషిశర్మను నిర్దోషిగా ప్రకటించింది.
అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలం
సందేహాలే తప్ప అభియోగాలను నిరూపించడంలో ప్రాసి క్యూషన్ విఫలమైందని హైకోర్టు తెలిపింది. కీలక సాక్షుల సాక్ష్యాలలో, బాధితురాలి తల్లి ప్రయాణ తేదీలు, గమ్య స్థానాలకు సంబంధించి స్పష్టమైన వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంది. 2017, ఏప్రిల్ 17న గర్భం విషయం తెలిస్తే, ఏప్రిల్ 25 వరకు ఫిర్యాదు చేయకపోవడానికి కారణాలు తెలుపలేదని ఆక్షేపించింది.
కల్నల్ శర్మ 2005లోనే వేసెక్టమీ చేయించుకున్నారని సర్టిఫైడ్ సర్టిఫికెట్ నిరూపిస్తోందని, అలాంటప్పుడు అతడు మరోసారి తండ్రి ఎలా కాగలరని ప్రశ్నించింది. విచారణలో దర్యాప్తు అధికారుల భారీ వైఫ ల్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. జవాబుదారీ తనంతో పనిచేస్తే వ్యవస్థ రావాలని సూచించింది.
పోలీసుల తీరు కారణంగా నిర్దోషిని శిక్షించి, దోషులను వదలివేయడం జరుగుతోందని అసహనం వ్యక్తంచేసింది. దర్యాప్తు నాణ్యత పర్యవేక్షణకు, పారదర్శకతను పెంపొందించడానికి స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. రిషిశర్మ విడుదల చేయాలని ఆదేశించింది.